రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 5 : “గాంధారి మైసమ్మ ఆలయ అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది. ఇప్పటికే చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవ తీసుకొని రూ.2.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో బొక్కలగుట్ట నుంచి ఖిల్లా వరకు తారు రోడ్డు నిర్మించారు.” అని నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య పేర్కొన్నారు. గాంధారి మైసమ్మ జాతర ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో పాల్గొని మాట్లాడారు. సర్కారు నిధులు మంజూరు చేసిన ప్పటికీ దర్బార్కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం విచారకరంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి దాదాపు 15 వేలకుపైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్(క్యాతనపల్లి) మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు శివారు.. మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట పంచాయతీలో గల గాంధారి ఖిల్లా అభివృద్ధికి ఐటీడీఏ అన్ని విధాలా సహకారం అందిస్తున్నదని ఏవో రాంబాబు అన్నారు. జాతర ముగింపు సందర్భం గా నిర్వహించిన ప్రజాదర్బార్లో నాయక్పోడ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య మాట్లాడారు. వచ్చే యేడాది జాతర నాటికి విద్యుత్, మంచినీరు, రోడ్లు ఏర్పాటు చేయాలని సర్కారుకు విజ్ఞప్తి చేశారు. నాయక్పోడ్ సంప్రదాయ పద్ధతిలోనే కోటను పునఃనిర్మించాలని కోరారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అభివృద్ధి చేసినట్టుగానే ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. భవిష్యత్లో ఆర్టీసీ వారితో మాట్లాడి జాతర సమయంలో బస్సులు నడిపించాలని కోరారు.
ఖిల్లా వరకు విద్యుత్ లైన్ మంజూరు చేయాలన్నారు. గత దర్బార్లో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇచ్చిన హామీ మేరకు రూ.2.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో బొక్కలగుట్ట నుంచి ఖిల్లా అటవీ ప్రాంతం వరుకు తారురోడ్డు నిర్మించారని తెలిపారు. సర్కారు నిధులు మంజూరు చేసినప్పటికీ దర్బార్కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం విచారకరంగా ఉం దని పేర్కొన్నారు. జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి తల్లిని దర్శించుకొని పూజలు చేశారు. ప్రజా దర్బార్కు మందమర్రి జడ్పీటీసీ రవి, వైస్ ఎంపీపీ రాజ్కుమార్, ఐటీడీఏ ఏపీవో భాస్కర్రావు, ఆర్డీవో వేణు, ఎంపీడీవో శశికళ, క్యాతనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్రెడ్డి, నాయక్పోడ్ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంజి రాజన్న, ఆలయ కమిటీ చైర్మన్ రమేశ్ పాల్గొన్నారు.
ముగిసిన మైసమ్మ జాతర
గాంధారి జాతర ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. శనివారం అర్ధరాత్రి నుంచి పూజలు అందుకొన్న మైసమ్మ తల్లిని ఆదివారం ఉదయం 6 గంటల నుంచి భక్తులు దర్శించుకోవడం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్ల్లి, జగిత్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఆదివాసీ నాయక్పోడ్ గిరిజనులు, సంఘాల నాయకులు 15 వేల మందికిపైగా తరలివచ్చారు. తల్లికి కోళ్లు, మేకలు, గొర్రెలు, కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లించుకున్నారు. జాతర నిర్వహణకు సహకరించిన ప్రభుత్వ విభాగాల అధికారులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.