ఎదులాపురం, జూన్ 25 : ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ తొలి విడుత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో నాలు గు రోజులపాటు నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలన గురువారంతో పూర్తయింది. ఈ ప్రక్రియను కళాశాల ప్రిన్సిపాల్, కో-ఆర్డినేటర్ డి.నరేష్ ప్రారంభించి పర్యవేక్షించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేస్తూ కౌన్సెలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. మొదటి రోజు 202 మంది, రెండో రోజు 110 మంది, మూడో రోజు 106 మం ది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోగా, చివరి రోజు 117 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు.
వారిలో 106 మంది హాజరై తమ ధ్రువపత్రాలను పరిశీలింపజేసుకున్నారు. మొత్తం నాలుగు రోజుల వ్యవధిలో 524 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని కోఆర్డినేటర్ డి.నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జూన్ 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. తొలి విడుత సీట్ల కేటాయింపు జూలై 10న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు గడువులోగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకొని ఇంజినీరింగ్ ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.