బేల/బోథ్,, సెప్టెంబర్ 12 : శ్రావణమాసం ముగింపులో బహుల అమావాస్య రోజున వచ్చే పొలాల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకృతిని పూజించడంతో పాటు వ్యవసాయంలో ఆరుగాలం శ్రమించే ఎద్దులను అందంగా సింగారించి, ఆరాధించే అరుదైన పండుగ ఇది. వ్యవపాయ పనులు పూర్తయిన క్రమంలో వచ్చే తొలి పండుగ కావడంతో రైతులు, కొన్ని సామాజిక వర్గాల ప్రజలు పొలాల అమావాస్యను అత్యంత అట్టహాసంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇతర పండుగలతో పోల్చితే ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే పొలాల పండుగలో సామాజిక అంశాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడతాయి .
ఎడ్లను పూజించే పండుగ….
శ్రావణమాసంలో వచ్చే చివరి పండుగగా గ్రామీణులు భావిస్తారు. గూడేలు, పల్లెల్లో అత్యంత ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం రైతులు అటవీ ప్రాంతానికి వెళ్లి ప్రకృతిలో విరబూసిన జంజేరు పూలు, పత్రి ఆకులు, నారను తీసుకువచ్చి తోరణాలు తయారు చేసి ఇంటి గుమ్మాలకు కడతారు. వేద పండితుడు, కుల గురువులను ఇంటికి ఆహ్వానించి కాళ్లు కడుగుతారు. పితృ దేవతలను బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందజేసి రుణం తీర్చుకుంటారు. మట్టితో ఎద్దుల ప్రతిమలను తయారు చేసి పూజించి, ఉపవాస దీక్షను విరమిస్తారు. ఎద్దులను చెరువులు, వాగుల్లో శుభ్రంగా కడిగి ఇండ్లకు తీసుకువస్తారు. వాటి వీపుపై రంగురంగుల బొమ్మలు, జూలు, మెడలో గంటలతో పాటు ఎడ్లను అందంగా అలంకరిస్తారు. సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు. ఆలయం చుట్టూ ఐదుసార్లు ఎద్దులతో ప్రదక్షణ చేయిస్తారు. గ్రామపటేల్ తోరణం తెంపితే గానీ ఎడ్లజతలు గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉండదు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఎడ్లకు నైవేద్యంగా..
ఆలయాల్లో ప్రదక్షిణ అనంతరం ఇంటికి తీసుకువచ్చిన ఎడ్ల జతలకు రైతులు పూజలు చేసి ఆ రోజు చేసిన వంటకాలను నైవేద్యంగా తినిపిస్తారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి విందు భోజనం ఆరగిస్తారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారంగా పెద్దలు చెబుతున్నారు. ఎద్దులు లేని రైతులు తమ బంధువుల ఎడ్ల జతలను తీసుకువచ్చి పూజలు చేస్తారు.
శుక్రవారం బడిగా పండుగ..
పొలాల అమావాస్య మరుసటిరోజు బడిగా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ . శ్రావణమాసంలో నెల రోజుల పాటు మాంసాహారాన్ని భుజించకుండా నియమనిష్టలు పాటించిన వారు శుక్రవారం బడిగా పండుగ జరుపుకుంటారు . అనంతరం మాంసాహరం స్వీకరిస్తారు. ఈగలు, దోమలు, రోగాలు తీసుకుపోరా బడిగా అంటూ ఇంట్లో నుంచి కేకలు వేస్తూ రాత్రి చేసిన పిండివంటల నైవేద్యాన్ని తీసుకొని గ్రామం పొలిమేర వరుకు వెళ్తారు. అక్కడ జమ్మిచెట్టుకు పూజలు చేసి కలిసికట్టుగా నైవేద్యం ఆరగిస్తారు. ఆ రోజు నుంచి ఈగలు, దోమలు, వ్యాధుల పారిపోతాయని వారి నమ్మకం.
మూడో రోజు నిలు..
పండుగ వేడుకల్లో మూడో రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. మద్యం, మాంసాహారం ముట్టకుండా భక్తిప్రవత్తులతో ఉంటారు. అందుకు మూడో రోజును నిలు అని పిలుచుకుంటారు. బడగ రోజు ఆనందంగా ఆడిపాడి అలసిపోయి నిలు రోజున పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు.
నాల్గో రోజు గురుగులంపడం…
అమావాస్య కార్యక్రమాల్లో చివరి (నాల్గో ) రోజు మాత్రం మహిళలు భాగస్వామ్యం ఉంటుంది. ఉదయం పూట ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజు ప్రత్యేకంగా మట్టితో ప్రమిదలను తయారు చేసి, ఆ ప్రమిదలను ఆడబిడ్డలు గ్రామ శివారు ప్రాంతంలోని చెరువుకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అక్కడే మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇంటికొచ్చిన తర్వాత చీకటయ్యాక మహిళలు డప్పుచప్పుళ్ల మధ్య దండారి, కోలాటం ఆడడం జరుగుతుంది. ఇలా సంస్కృతీ సంప్రదాయాల కలబోతతో ప్రకృతిని, పశువులను పూజించి, ఆరాధించడం పొలాల అమావాస్య పర్వదిన వేడుకల్లో మాత్రమే కనిపిస్తున్నది.