మంచిర్యాల, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ఈ మేరకు ఇటీవల జిల్లాల్లో మూడేళ్లకు మించి సర్వీస్ కలిగి ఉన్న అధికారులను బదిలీ చేశారు. కొన్ని రోజుల క్రితమే రెవెన్యూ సహా ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొనే ఇతర శాఖల అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో బాధ్యతలు తీసుకున్నా రు. ఈ మేరకు భార్య, పిల్లలతో షిఫ్ట్ కూడా అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం పని చేస్తున్న జిల్లా నుంచి మరొక జిల్లాకు బదిలీ చేస్తే సరిపోతుందనకుంటే.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వేరే పార్లమెంట్ నియోజకవర్గానికి బదిలీ చేయాలని ఎన్నికల సంఘం నిబంధనల్లో స్పష్టం చేసింది. పని చేసిన జిల్లాతో పాటు సొంత జిల్లా కూడా అదే పార్లమెంట్ పరిధిలో ఉండకూడదని స్పష్టం చేసింది. దీంతో పెద్దపల్లి జిల్లా రామగుండం, మంథని నియోజకవర్గాలు, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పని చేసి మంచిర్యాలకు బదిలీపై వచ్చిన అధికారులను మరోసారి బదిలీ చేయాల్సి వస్తుంది.
మరోవైపు మంచిర్యాల జిల్లాలో చేసి ఆసిఫాబాద్కు బదిలీ అయిన కొందరు అధికారుల సొంత గ్రామాలు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. ఆ లెక్కన వారు అక్కడ స్థానికులయ్యారు. బదిలీలు తప్పవని అధికారులు చెబుతుండగా, ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 20 నుంచి 30 మంది అధికారులకు పైగా బదిలీకానున్నారు. ఇటీవలే డీపీఆర్వోలను బదిలీ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా డీపీఆర్వోకు ముందు మంచిర్యాలలో పోస్టింగ్ ఇచ్చారు. కానీ, ఆయన సొంత జిల్లా మంచిర్యాల కావడంతో ఆయన్ని భూపాలపల్లికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో సిరిసిల్ల పోస్టింగ్ తీసుకున్న శారదను స్థానికత పేరు చెప్పి మంచిర్యాలకు పంపారు. ఇలా బదిలీ ఆర్డర్లు ఇవ్వడం, తీరా బాధ్యతలు స్వీకరించాక కారణాలు చెప్పి వెంటనే బదిలీ చేయడంపై ఉద్యోగులు పరేషాన్ అవుతున్నారు. నెల.. రెండు నెలల వ్యవధిలోనే ఇలా ట్రాన్స్ఫర్ చేయడం ఏమిటని ఆందోళన చెందుతున్నారు.