బోథ్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర సర్కారు అందిస్తున్న సహకారం, నిధులతో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. గతంలో సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో కావాల్సిన మౌళిక వసతులను సమకూర్చుకుంటున్నది. వైద్య, విద్య, రవాణా, సాగునీరు, వ్యవసాయంలో గణనీయమైన మార్పును సాధించింది. వానకాలమొస్తే రాకపోకలకు ఇబ్బందులు పడ్డ జనం, నేడు అందుబాటులోకి వచ్చిన రోడ్లు, వంతెనలపై ప్రయాణం సాఫీగా కొనసాగిస్తున్నది. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేపట్టిన కార్యక్రమాలతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తమ గ్రామాల రూపురేఖలు మారాయని ప్రజానీకం ముక్తకంఠంతో చెబుతున్నది.
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో గ్రామాలన్నీ ప్రగతి బాట పట్టాయి. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పల్లెలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో సుస్థిర అభివృద్ధిని సాధించాయి. ఉమ్మడి రాష్ట్రంలో బోథ్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గ ప్రజలకు వరంగా మారాయి. వివిధ రంగాలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నది. వైద్య, విద్య, రవాణా, సాగునీరు, వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నది ప్రభుత్వ పథకాల కారణంగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతుండడంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. గతంలో ఏ గ్రామానికి వెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం ఉండేది కాదు. వాగులు వంకలు పొంగి రాకపోకలు నిలిచేవి. రోడ్లు, వంతెనల నిర్మాణంతో ప్రజలకు రవాణా ఇక్కట్లు లేకుండా పోయాయి. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకాల ఫలితంగా రైతులకు సాగునీరు అందుతున్నది. గతంలో ఒక్క పంట సాగు చేయాలంటే ఇబ్బందులు పడే అన్నదాతలు ఇప్పడు రెండు పంటలు సాగు చేస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. పాఠశాల భవనాలు సరిగా లేక విద్యార్థుల చదువులు ముందుకు సాగేవి కావు. ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించడంతో పేద విద్యార్థులు బాగా చదువుకుంటున్నారు.
– ఆదిలాబాద్, మార్చి 18 ( నమస్తే తెలంగాణ)
పేద విద్యార్థుల చదువుల కోసం పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నది. ఇందులో భాగంగా బోథ్ నియోజక వర్గంలో 6 బీసీ, మైనార్టీ స్కూళ్లను ఏర్పాటు చేసింది. దీంతో పాటు నియోజకవర్గంలో గిరిజన విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాలను కూడా కొనసాగిస్తున్నది. నియోజకవర్గంలోని బజార్హత్నూర్, గుడిహత్నూర్, బోథ్లలో ఆదర్శపాఠశాలలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. మన ఊరు, మనబడి పథకంలో భాగంగా మొదటి విడుతలో 112 పాఠ శాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది.
నియోజకవర్గంలో సాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఉండేది. వానకాల పంటలను మాత్రమే సాగు చేసేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో సాగునీటి రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల మరమ్మతులు, చెక్డ్యాంల నిర్మాణాలు చేపట్టారు. రూ. 368 కోట్లతో భీంపూర్ మండలం పిప్పల్కోటి వద్ద పెన్గంగ నదిపై సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తు న్నారు. 112 చెరువులకు మరమ్మతులు చేపట్టడంతో 24 వేల ఆయకట్టు పెరిగింది. నియోజకవర్గంలో కొత్తగా 9 చెరువులు, 23 చెక్డ్యాంలను నిర్మించారు.
బోథ్ నియోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలకు వైద్యసౌకర్యాలు సరిగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. సీజనల్ వ్యాధులతో మరణాలు సంభవించేవి. నియోజకవర్గంలో వైద్యసేవలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. బోథ్ మండలం కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ దవాఖాన భవనానికి ప్రభుత్వం రూ. 10.50 కోట్లను మంజూరు చేయగా పనులు ప్రారంభమయ్యాయి. బోథ్ నియోజకవర్గంలో రూ. 14.4 కోట్లతో తొమ్మిది ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మించారు. తలమడుగు, భీంపూర్, పొచ్చర, బొరిగామ, తలమద్రి, ఇచ్చోడ,. అందూర్, చింతల్బోరి, కరత్వాడలో నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలో రూ. 90 లక్షలతో నేరడిగొండ, సొనాల, తాంసి, భీంపూర్, నర్సాపూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం కోసం వచ్చే వారికి వసతులు కల్పించారు. తలమడుగు మండల కేంద్రంలో అన్ని వసతులతో కూడిన దవాఖాన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.50 కోట్లు మంజూరు చేసింది. రూ.కోటితో తలమడుగు, పొచ్చర, బోరిగామ, కరత్వాడ, ఇచ్చోడలో ఒక్కో సెంటర్ చొప్పున నిర్మిస్తున్నారు.
భూమిలేని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు దళితబస్తీ పథకం వరంగా మారింది. నియోజకవర్గంలోని 9 మండలాల్లో 1019 మంది లబ్ధిదారులకు రూ.111.27 కోట్లతో 2557 ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో గతంలో కూలీలుగా ఉన్నవారు రైతులుగా మారారు. సర్కారు ఉచితంగా ఇచ్చిన భూముల్లో రెండు పంటలు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలో రూ.10 కోట్లతో 100 మంది లబ్ధిదారులకు వివిధ యూనిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన సాయంతో వారు ఉపాధి పొందుతున్నారు.
రూ. 24 కోట్లతో భీంపూర్, బోథ్, ఇచ్చోడ, సిరికొండ, తలమడుగులో కేజీబీవీలు, హాస్టల్ భవనాలను ఏర్పాటు చేశారు. రూ. 9 కోట్లతో మన్నూర్, కజ్జర్ల, నర్సాపూర్, నిపాని, దేగామ, బోథ్లలో విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల రైతులు, ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది. రూ. 13.50 కోట్లతో బోథ్, ఇచ్చోడ, తాంసి, తలమడుగు, గుడిహ త్నూర్లో పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మించారు. ఫలితంగా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరింది.
నియోజకవర్గంలోని రహదారులు, వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం భారీగా రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టడంతో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు దూరమయ్యయి. రూ. 6.52 కోట్లతో బోథ్ నుంచి నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అడెల్లి వరకు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. వీటితో పాటు నియోజకవర్గంలోని రూ.42.29 కోట్లతో మారుమూల గిరిజన గ్రామాలకు కొత్తగా ప్రభుత్వం బీటీ రోడ్లు, రూ.6.40 కోట్లతో బజార్హత్నూర్ మండలం కొల్హారి నుంచి మొర్కండి వంతెనలు, రూ. 18 కోట్లతో జమ్దాపూర్ నుంచి కరంజి వరకు బీటీ రోడ్డు నిర్మాణం కొనసాగుతున్నది. రూ. 53.68 కోట్లతో నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ రోడ్ల నిర్మాణాలు, రూ.7.39 కోట్లతో ఆర్ అండ్బీ శాఖ అధ్వర్యంలో వంతెనలు నిర్మించారు.
సమైక్య పాలకుల కారణంగా బోథ్ నియోజ కవర్గంలో రవాణా సౌకర్యాలు బాగా లేకుండె. దీంతో జనమంతా చాలా ఇబ్బందులు పడ్డరు. వానకాలంలో వాగులు పొంగి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. గిరిజన గ్రామాలకు రోడ్లు లేక స్థానికులకు వైద్య సేవలు అందేటివి కాదు. స్వరాష్ట్రంలోనే మా పల్లెలు బాగు పడినయ్. మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడింది. మారుమూల గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. వంతెనల నిర్మాణం కారణంగా వానకాలంలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు.
– కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్, ఇచ్చోడ
భీంపూర్ మండలంలోని రైతులు సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వానకాలమే పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. ప్రభుత్వం రూ.386 కోట్లతో పెన్గంగపై పిప్పల్కోటి ప్రాజెక్టును నిర్మిస్తున్నది. పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మండలంలోని భూములు సస్యశ్యామలంగా మారుతయ్. పది వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఈ ప్రాజెక్ట్ కింద సాగవుతుంది. ఇక యాసంగిలో కూడా పంటలు వేసుకునే అదృష్టం ఈ ప్రాంత రైతులకు దక్కుతుంది. సీఎం కేసీఆర్ అచ్చినంకనే పల్లెల రూపురేఖలు మారుతున్నయ్. మా బోథ్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు గతంలో లేనంతగా జరుగుతున్నయ్.
– గడ్డం లస్మన్న, రైతు, పిప్పల్కోటి, భీంపూర్ మండలం
నేను మా ఇంట్లోళ్లతో కలిసి కూలీ పనులకు పోయేది. ప్రభుత్వం దళితబస్తీలో భాగంగా నాకు మూడెకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేసింది. గ్రామం లో మంచిభూమిని అందించడంతో నేరుగా రెండు పంటలు పండిస్తున్న. వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది పంటలు వేస్తున్న. యాసంగిలో శనగ, గోధుమ పంటలు సాగు చేస్తున్న. గతంలో కూలీగా ఉన్న నేను ప్రభుత్వం అందించిన సాయంతో రైతుగా మారిన. ఇప్పుడు కుటుంబసభ్యులతో కలిసి నా పొలంలో నేను పని చేసుకుంటున్న.
– తల్వారే ఇందుబాయి, దళితబస్తీ లబ్ధిదారు, ముక్రా(కే)