ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ): కులవృత్తులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని బీసీ కులవృత్తుల పథకం లబ్ధిదారు కుందారపు మురళి అన్నారు. మంచిర్యాలలో బీసీ కులవృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెలమపల్లి గ్రామంలో కుండలు చేసుకొని ఉపాధి పొందే కుందారపు మురళికి రూ. 1 లక్ష చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో తన సంతోషాన్ని పంచుకున్నారు.
బీసీల కోసం ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి?
కుందారపు మురళి: గతంలో ఏ ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలేదు. దీంతో కులవృత్తులపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. కులవృత్తులను ప్రోత్సహించడం, మాకు ఆర్థిక సాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. సర్కారు అందిస్తున్న సాయం మా ఉపాధిని మెరుగుపర్చడానికి ఎంతో ఉపయోగపడుతున్నది.
ప్రస్తుతం ఉపాధి ఎలా ఉంది..?
మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెలమపల్లి. కుమ్మరి వృత్తి చేసుకుంటున్న. నేను, భార్యతో కలిసి కుండలు, రంజన్లు, ఇతర మట్టి వస్తువులు తయారు చేస్తా. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు చదువుకుంటున్నారు. శుభకార్యాలకు ఐరెని కుండలతో పాటు గృహప్రవేశాలకు ఉపయోగపడే కురాటి కుండలు, మల్లన్న కడలు, గరిగబుడ్డి, కోలు గడిమంతు, మలన్న బోనాల కుండలతో పాటు కందులు, పెసర్లు వేయించే మంగళం, రంజన్లు తయారు చేస్తున్న. మేము చేసే వస్తువులకు డిమాండ్ ఉన్నా, ఆర్థిక పరిస్థితి కారణంగా సరిగా చేయలేకపోతున్నాం.
ఈ సాయం ఎలా ఉపయోగించు కోవాలనుకుంటున్నారు?
లబ్ధిదారుడు: ప్రభుత్వం బీసీ వృత్తులకు ఆర్థిక సాయం అందించడంలో భాగంగా నాకు రూ. 1 లక్ష సాయం ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. ఇప్పటి వరకు ఆర్డర్లు ఉన్నా పెట్టుబడి లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పడు సర్కారు అందించిన సాయం మా ఉపాధి మెరుగపర్చడం కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డబ్బులతో సాంచాలు, మట్టిని తొక్కే యంత్రాలను కొనుక్కుంటా. ఇవి అందుబాటులోకి రావడంతో కుండలు ఎక్కువగా చేసే అవకాశం లభిస్తుంది. ఉపాధి చాలా వరకు మెరుగుపడుతుంది.
ప్రస్తుతం మీ వస్తువులకు మార్కెటింగ్ ఎలా ఉంది?
లబ్ధిదారుడు: ఏడాదిలో వర్షాకాలంలో తప్ప మిగతా సీజన్లో మాకు గిరాకీ బాగా ఉంటుంది. మేము చేసిన కుండలను రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు వచ్చి మా వద్ద కొనుగోలు చేస్తుంటారు. శుభకార్యాల సీజన్, పండుగ రోజుల్లో ఆదాయం ఉంటుంది. హోల్సేల్ వ్యాపారులు ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా కుండలు, వివిధ రకాల మట్టి వస్తువులు తయారు చేస్తాం.