భైంసా, డిసెంబర్2 : పట్టణంలో వికాస్ పాఠశాల వెనుకాల గల వెంచర్లను శుక్రవారం అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవి కుమార్ మాట్లాడుతూ అక్రమ లేఅవుటల్లను, అక్రమ నిర్మాణాలను గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగిస్తున్నామన్నారు. అంతేగాకుండా ప్రభుత్వ భూముల్లో లేఅవుట్ చేస్తే ఊపేక్షించేది లేదన్నారు. ఆక్రమణలను తొలగించి బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే అనుమతి పొంది కూడా ఓపెన్ పేస్ నిబంధనలను పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ముథోల్, డిసెంబర్2 : ముథోల్లోని పలు కాలనీలో అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లను తహసీల్దార్ శ్యాంసుందర్ సిబ్బందితో కలిసి తొలగించారు. మండలంలో 52 అక్రమ వెంచర్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అన్ని నిబంధనల ప్రకారం ఉన్నవాటిని ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. ఇప్పటికే ముథోల్లోని 8 అక్రమ లేఅవుట్లను తొలగించామన్నారు. నాయాబ్ తహసీల్దార్ ఆసిఫ్, సీనియర్ అసిస్టెంట్లు సత్యనారాయణతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.
కుభీర్, డిసెంబర్ 2: అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు నష్ట పోవద్దని తహసీల్దార్ బత్తుల విశ్వంభర్ సూచించారు. కుభీర్, పల్సి గ్రామంలోఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లను రెవెన్యూ సిబ్బందితో వెళ్లి తొలగించారు. ఈసందర్భంగా ఆయన అక్కడికి వచ్చిన పలువురు ప్లాట్ల కొనుగోలు దారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అక్రమంగా వెంచర్లపై చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈసందర్భంగా గిర్దావర్ వెంకట రమణ, సిబ్బంది పాల్గొన్నారు.