ఆదిలాబాద్ రూరల్ : బుద్ధ భగవానుని ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో గురువారం నిర్వహించిన దమ్మచక్ర పరివర్తన్ దివాస్ కార్యక్రమాల్లో బుద్ధభగవానుడు, అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధభగవానుడు శాంతియుత మార్గంలో నడవాలని, హింసను విడనాడాలని ప్రజలకు సూచించారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నమ్మిన ఆయుధాలు విద్య అని అన్నారు. విద్యతోనే విజ్ఞానం, చైతన్యం, మార్పు వస్తుందని వెల్లడించారు.
పట్టణంలోని పలు కాలనీల్లో బుద్ధ విహార్తో పాటు షెడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.దళిత బంధు ద్వారా దళితుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బంగారుగూడలో నిర్మిస్తున్న భవనాల పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ప్రజ్ఞ కుమార్, రాంచందర్ మహాత్మ ,శైలేందర్ వాగ్మారే, కౌన్సిలర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.