ఎదులాపురం, ఫిబ్రవరి 13 : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్య పరిష్కారంపై దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాధానం తెలియజేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పింఛన్లు, దళితబస్త్తీ, భూ సమస్యలు, రాజీవ్ స్వగృహ ఇళ్ల పనులు, ఉపాధి, తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయి. కలెక్టర్ అర్జీలను స్వీకరించి, వాటిని పరిశీలించి, పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్జీదారుడి సమస్యను పరిశీలించాలని, ప్రభుత్వ నిబంధనలమేరకు చర్యలు తీసుకురావాలన్నారు. అంతకుముందు ఆర్థిక ప్రయోజనాలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సోమవరం నుంచి నిర్వహిస్తున్న వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో రమేశ్ రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.