తాండూర్/మంచిర్యాల ఏసీసీ, అక్టోబర్ 21 : తొలిరోజు పితృ అమావాస్య నుంచి 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన బతుకమ్మ ప్రధాన వేడుక నేటి సద్దుల బతుకమ్మతో ముగియనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతికెక్కిన పల్లె సుద్దులతో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి సంస్కృతీ సంప్రదాయలు వెల్లివిరిసేలా పాటలు పాడుతూ ఆటలాడుతూ మహిళలు నిర్వహించుకొనే ఏకైక పండుగ సద్దుల బతుకమ్మ. ఈ పండగను మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు వేడుకలు నిర్వహించుకునేలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
బతుకమ్మ పండగ వస్తుందంటే మహిళలకు చాలు పెళ్లి అయిన వారు తల్లివారింటికి చేరుకుంటారు. అల్లుళ్లు కూతుళ్ల్లను ఇంటికి పిలిపించుకున్నారు. కొత్తబట్టలతో పిండి వంటలతో ఆనందోత్సవాలతో వేడుక చేసుకుంటారు. పండుగ సందర్భంగా వ్యాపార కేంద్రాలు సందడిగా మారాయి.
సద్దుల బతుకమ్మకు కావాల్సిన వివిధ రకాల పూల దుకాణాలు తాండూర్ ఐబీలో నెలకొల్పారు. అధిక ధరలు ఉన్నా కూడా మహిళలు ఉత్సాహంతో పూలను కొనుగోలు చేశా రు. గ్రామాల్లో ఊరూ రా బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సద్దుల బతుకమ్మ నిమజ్జనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ ఆటపాటల నిర్వహణకు, నిమజ్జనానికి విద్యుత్ ఫ్లడ్ లైట్లు, మైదానాలను చదువును చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రధాన రహదారుల గుండా బతుకమ్మ వేడుకలు జరిగే మైదానాలు, చెరువుల వద్ద బందోబస్తును ఏర్పా టు చేశారు. బతుకమ్మలకు స్వాగతం పలుకుతూ మైక్లు ఏర్పాటు చేశారు.