మంచిర్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘యూనియన్ బై-లాతో మంచిర్యాల టీఎన్జీవోకు సంబంధమే లేదు.. మేం చెప్పిందే వేదం.. మేం నడిపిందే సంఘం.. ఎవ్వరేం అనుకున్నా.. మేం చేసేది చేసుకుంట పోతం’.. అన్నట్లు ఉంది మంచిర్యాల జిల్లా టీఎన్జీవో వ్యవహారం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీఎన్జీవో సంఘంలోని లుకలుకలు బయట పడుతున్నాయి. టీజీవో(తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల) సంఘం మంచిర్యాల జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీపతిబాబు అనే అధికారి, టీఎన్జీవో (తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల) సంఘం జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్గానూ ఉన్నారు.
నిబంధనల ప్రకారం ఒక అధికారి ఒక సంఘంలోనే ఉండాలి. ఆయా యూనియన్ల బై-లాలో ఇది స్పష్టంగా ఉంది. కానీ.. ఇందుకు పూర్తి విరుద్ధంగా ఒకే అధికారి రెండు సంఘాల్లో, అది ఒకే పదవిలో ఉండడం గమనార్హం. టీఎన్జీవో అనేది తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం.. ఇందులో గెజిటెడ్ హోదాలో ఉన్న అధికారులకు సభ్యత్వం ఉండకూడదు. కానీ ఒక్క మినహాయింపు మాత్రం ఉంది. డిప్యూటీ తహసీల్దార్(డీటీ)గా ప్రమోషన్పై వచ్చిన వారి హోదా గెజిటెడ్ అయినప్పటికీ టీఎన్జీవోలో సభ్యులుగా ఉండొచ్చు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేసే డీటీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ లెక్కనే మంచిర్యాల టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కొనసాగుతున్నారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో సైతం ఉంది. కానీ.. శ్రీపతిబాబు పంచాయతీరాజ్ శాఖలో పని చేస్తున్నారు. ఈయన ఎంపీవో స్థాయి అధికారి, నాలుగేళ్ల క్రితం గెజిటెడ్ అయ్యారు. మరి ఈయన ఏ లెక్కన టీఎన్జీవో సంఘంలో కొనసాగుతున్నారనే విషయంపై స్పష్టత లేదు. అది వదిలేస్తే గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాక టీజీవో సభ్యత్వం తీసుకున్న ఆయన ఆ సంఘంలోనూ కీలకమైన పదవిలో ఉన్నారు.
ఈ సారైనా ఆయన టీఎన్జీవో సంఘం నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటారనుకుంటే.. ఇటీవల టీఎన్జీవో అనుబంధంగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల సంఘానికి నిర్వహించిన ఎన్నికలకు ఆయనే ఎన్నికల అధికారిగా వ్యహరించారు. ఇలా ఒకే అధికారి రెండు సంఘాల్లో పదవుల్లో ఉండడంపై టీఎన్జీవోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఒక్కరనే కాదు వేర్వేరు డిపార్ట్మెంట్లలో పని చేసే గెజిటెడ్ ఆఫీసర్లకు సైతం ఇటీవల టీఎన్జీవో సభ్య త్వం ఇచ్చినట్లు, మరికొందరికి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. మరి ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమా.. కాదా అనేది తేలాల్సి ఉంది.
టీఎన్జీవో ప్రస్తుత జిల్లా కార్యవర్గం తీరుతో మంచిర్యాల యూనిట్లో వ్యతిరేకత పెరిగింది. నిబంధనల ఉల్లంఘనలు, వివాదాల నేపథ్యంలో ఇప్పుడున్న కార్యవర్గం నుంచి కాకుండా కొత్తగా పోటీ చేస్తున్న వారివైపు ఉద్యోగులు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలో మూడేళ్ల సర్వీస్ ఉంటేనే పోటీకి అర్హులనే వాదనను తీసుకువచ్చి, మంచిర్యాల యూనిట్లో పోటీ చేసే వారిని అనర్హులుగా ప్రకటించాలనే కుట్రలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
యూనియన్ బై-లా ప్రకారం టీఎన్జీవోలో ఏ జిల్లాలోనైనా మూడేళ్లు పని చేస్తే చాలు పోటీ చేయొచ్చు. కానీ ఇక్కడ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకవచ్చి అసలు పోటీలేకుండా ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎవరేం అనుకున్నా ఓటరు లిస్టు లేకుండానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. బై-లా ప్రకారం ఓటర్ లిస్టు ఎన్నికలు నిర్వహించే యూనిట్లలో ఎన్నికల అధికారుల ద్వారా డిస్ప్లే చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఓటర్ లిస్ట్ బయటికి రాలేదు. అసలు సభ్యత్వ నమోదే ఇంకా పూర్తి కాలేదని తెలుస్తున్నది.
నాన్ గెజిటెడ్ క్యాడర్ నుంచి గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాను. మా యూనియన్ జనరల్ బాడీ మీటింగ్లో, యూనియన్ బై-లాలో ఫస్ట్ లెవల్ గెజిటెడ్ ఆఫీసర్లు టీఎన్జీవోలో కొనసాగవచ్చనే చర్చ నడిచింది. యూని యన్పై ఉన్న ప్రేమతోనే టీఎన్జీవోలో కొనసాగుతున్నా. అసలు టీజీవో సంఘంలో నీను ఎలాంటి పదవులు ఆశించలేదు. బాధ్యత ఇచ్చారు తీసుకున్నా. టీఎన్జీవో నా మాతృ యూనియన్. అందులోనే ఉండాలని కోరుకుంటా.
– శ్రీపతిబాబు, టీజీవో అండ్ టీఎన్జీవో అసోసియేట్ ప్రెసిడెంట్
ఏ ప్రభుత్వ ఉద్యోగైనా రెండు యూనియన్లలో కొనసాగడానికి వీల్లేదు. ఫస్ట్ లెవల్ గెజిటెడ్ హోదాలో టీఎన్జీవోలో కొనసాగ వచ్చనే అనే అంశంపై మా యూనియన్ జనరల్ బాడీ మీటింగ్లో చర్చించిన మాట వాస్తవమే. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. కానీ ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. కానీ రెండు యూనియన్లలో కొనసాగడానికి లేదు. ఒకవేళ మంచిర్యాల సంఘంలో అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే వారిని యూనియన్ నుంచి తొలగిస్తాం.
– మారం జగదీశ్వర్, టీఎన్జీవో స్టేట్ సెక్రటరీ