భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత ప్రజల ప్రియబాంధవుడు డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ పేరును తెలంగాణ సర్కారు నూతన సచివాలయానికి పెట్టి గౌరవించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం టీఆర్ఎస్ శ్రేణులు, అనుబంధ, దళిత సంఘాల నాయకులు సంబురాలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో టీఆర్ఎస్, అనుబంధ, దళిత సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. జై భీమ్.. జైజై కేసీఆర్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ వంటి మహానుభావుడి పేరు సచివాలయానికి పెట్టడం అందరికీ గర్వకారణమని, ఈ సందర్భంగా కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
నిర్మల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, నాయకులు
నిర్మల్ అర్బన్/ఎదులాపురం/మందమర్రి, సెప్టెంబర్ 15 : నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నది. భూమిలేని వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు దళితబస్తీ కింద మూడెకరాల భూమి ఇస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలోని 1,883 దళిత కుటుంబాలకు ప్రభుత్వం 4,787 ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేసింది. ఇందుకు ప్రభుత్వం రూ.208.27 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు అందిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడుత దళితబంధు పథకంలో భాగంగా 249 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. ఇందుకు ప్రభుత్వం రూ.21.65 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వం అందించిన సాయంతో వారు వివిధ యూనిట్లను తీసుకుని ఉపాధిని మెరుగుపర్చుకుంటున్నారు.
అంబరాన్నంటిన సంబురాలు
కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు సంబురాలు అంబరాన్నంటాయి. నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ వంటి మహానుభావుడి పేరు సచివాలయానికి పెట్టడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మరో వైపు పార్లమెంట్ బిల్డింగ్కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్ గండ్రత్ రమణ, నాయకులు ముడుసు సత్యనారాయణ, సుభాష్రావు, పాకాల రాంచందర్, నర్సాగౌడ్, సయ్యద్ ముషీరొద్ద్దీన్ పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలో..
నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ కేసీఆర్ ప్రకటించడంపై మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో టీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులతోపాటు, దళిత సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం సాయంత్రం పట్టణంలో డప్పు చప్పుళ్ల మధ్య భారీ ఊరేగింపు తీశారు. బీ1 టీఆర్ఎస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, ఇతర సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అసెంబ్లీకి అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణం..
కోటపల్లి, సెప్టెంబర్,15 : తెలంగాణ అసెంబ్లీకి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. పార్లమెంట్కు అంబేద్కర్ పేరును పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత పార్లమెంట్ భవనానికి కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరును పెట్టాలి. ఇందుకు అన్ని రాష్ర్టాలు కూడా ఏకగ్రీవ తీర్మానం చేయాలి. కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేవాలి.
– మంత్రి సురేఖ, ఎంపీపీ, కోటపల్లి
కేంద్రం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి..
కోటపల్లి, సెప్టెంబర్,15 : తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ జాతికే గర్వకారణం. సమాజంలో ప్రతి ఒక్కరినీ సమాన దృష్టితో చూసిన బీఆర్ అంబేద్కర్ పేరును తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనానికి పెట్టడం గొప్ప విషయం. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో దళిత, వెనుకబడిన వర్గాల్లో ఆత్మగౌరవం మరింత పెరిగింది. పార్లమెంట్కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్రం స్పందించాలి. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. – కుమ్మరి సంతోష్, ఆలుగామ, సర్పంచ్
అంబేద్కర్ ఆశయాలకు గుర్తింపు..
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 15 : అంబేద్కర్ ఆశయాలను గుర్తించింది కేసీఆరే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు మంచి పరిపాలన, సంక్షేమ పథకాలు అందించినప్పుడే గుర్తింపు ఉంటుందని అంబేద్కర్ భావించారు. ఆయన చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరూపిస్తున్నది. దళితబంధు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల వంటి వాటిని అమలు చేస్తున్న ప్రభుత్వం నూతన అసెంబ్లీ భవనానికి అంబేద్కర్ పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేయడం శుభసూచకం. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ స్ఫూర్తి ప్రపంచ దేశాల్లోని నలుమూలాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడం చట్టసభలను గౌరవించడం అవుతుంది. – ఎలుగు సుధాకర్, నిర్మల్.
అంబేద్కర్ స్ఫూర్తి మనందరికీ బాట..
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 15 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనందరికీ స్ఫూర్తిదాయకం. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన కేసీఆర్.. నూతనంగా నిర్మించే తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం శుభపరిణామం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ చరిత్రను తరతరాలకు తెలియజేసేందుకు నామకరణం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలతోపాటు గొప్ప నాయకుల స్ఫూర్తి జాతికి తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని మరోసారి నిరూపించారు.
– ముడుసు సత్యనారాయణ, దళిత సంఘాల ఐక్య వేదిక జిల్లా నాయకుడు.
పార్లమెంట్ భవనానికీ పేరు పెట్టాలి
కోటపల్లి, సెప్టెంబర్,15 : రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా మిగతా రాష్ర్టాల సీఎంలు కూడా కేసీఆర్ బాటలోనే నడవాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ యావత్ ప్రజలు స్వాగతిస్తున్నారు. దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహానీయుడి పేరును సచివాలయానికి పెట్టడం ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ తీర్మానం ప్రకారం పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెడితే బాగుంటుంది. – పబ్బ అనిల్కుమార్, పారుపల్లి
అంబేద్కర్పై ఉన్న గౌరవానికి ప్రతీకగా..
ఎదులాపురం, సెప్టెంబర్ 15 : తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం బాగుంది. ఇది యావత్ ప్రజలకు తీపికబురే. ప్రభుత్వానికి అంబేద్కర్ సిద్ధాంతాలపై ఉన్న గౌరవానికి ప్రతీక ఇది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే దళిత సమాజానికి దళితబంధు,దళితబస్తీ తదితర పథకాల ద్వారా ఆర్థిక భరోసా వచ్చింది. అలాంటిది ఇప్పుడు సచివాలయానికి బాబాసాహెబ్ పేరునే ఖరారు చేయడం అనేది చరిత్రలో సువర్ణ్ణాక్షరాలతో లిఖించదగినది. సీఎం కేసీఆర్ ఒక్కరే కాదు రాష్ట్ర ప్రజలు కూడా కోరేదేమిటంటే పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని. ఈ నిర్ణయంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. – బండారి అశోక్, ఎమ్మార్పీఎస్ టీఎస్, జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్
కేసీఆర్కు మరాఠా సమాజం తరపున వందనాలు
ఎదులాపురం, సెప్టెంబర్ 15 : సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలను సమంగా ఆదరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడుతున్నట్లు ప్రకటించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అంబేద్కర్ పేర్కొన్న ఆర్టికల్ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్ పలుమార్లు గుర్తు చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ కోరినట్లుగా కేంద్ర సర్కారు కూడా పార్లమెంట్ భవన సముదాయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలి. మరాఠా సమాజం తరఫున సీఎం కేసీఆర్కు వందనాలు. – మిట్టాపురి యోగేశ్, మరాఠా సంఘం యూత్ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్
అంబేద్కర్ అంటే కేసీఆర్కు గౌరవం..
కాగజ్నగర్ టౌన్, సెప్టెంబర్ 15 : డా బీఆర్ అంబేద్కర్ పేర్కొన్న ఆర్టికల్ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన అంటే ఎనలేని గౌరవం. కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించడం గొప్ప విషయం. ఇందుకు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెట్టాలి. – మదన్ మోహన్, వార్డు కౌన్సిలర్, కాగజ్నగర్