ఆదిలాబాద్, డిసెంబర్ 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల పోలింగ్ నేడు (శుక్రవారం) జరుగనున్నది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రా రంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. పో లింగ్ నిర్వహణలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు కలిపి 937 మంది ఓటర్లు ఉన్నారు. వీరు సమీప ప్రాంతాల్లో ఓటు వేసే విధంగా అధికారులు అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పాత జిల్లా పరిషత్ సమావేశం భవనం, ఉట్నూరు ఎంపీడీవో కార్యాల యం, మంచిర్యాల జిల్లాలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరం మొదటి అంతస్తు, బెల్లంపల్లి ఎంపీపీ సమావేశ భవనం, నిర్మల్ జిల్లాలో జిల్లా కేంద్రంలోని జడ్పీ కా ర్యాలయం, భైంసా మండల పరిషత్ కార్యాలయం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బా లికల పాఠశాల, కాగజ్నగర్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఆదిలాబాద్ పో లింగ్ కేంద్రంలో 181 మంది, ఉట్నూర్లో 42 మంది, మంచిర్యాలలో 208 మంది, బెల్లంపల్లిలో 88 మంది, నిర్మల్లో 15 1 మంది, భైంసాలో 102 మంది, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 69 మంది, కాగజ్నగర్లో 96 మంది ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. మాస్క్లు తప్పనిసరిగా ధరించాలి. ఎవరికైనా పాజిటివ్ వస్తే పీపీఈ కిట్లు ధరించి ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ..
స్థానిక సంస్థల ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఆదిలాబాద్ టీటీడీసీలో ఎన్నికల సిబ్బందికి అధికారులు పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిక్తా పట్నాయక్ పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలింగ్ నిర్వహణపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ విధులకు వచ్చిన పోలీసులకు వైద్యసిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. సామగ్రిని తీసుకున్న సిబ్బంది వాహనాల్లో పోలీసు బందోబస్తుతో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో 64 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులతో సిబ్బంది వాహనాల్లో ఆదిలాబాద్కు చేరుకుంటారు. బ్యాలెట్ బాక్సుల స్వీకరణ వాటిని భద్ర పర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి దండె విఠల్, ఇండిపెండెంట్ అభ్యర్థి పుష్పరాణి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో దండె విఠల్ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు.
ఓటు ఎలా వేయాలి
బ్యాలెట్ పేపర్పై ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి
ఆర్టర్ ఆఫ్ ప్రిఫరెన్స్ క్రమంలో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి 1 అని రాసి ఓటు నమోదు చేయాలి.
మిగిలిన అభ్యర్థులకు ప్రాధాన్యతను బట్టి 2,3,4 తదితర అంకెలు నమోదు చేసుకోవచ్చు.
ఓటరు బ్యాలెట్ చెల్లుబాటు కావాలంటే తమకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా 1 అని రాసి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తదుపరి ప్రాధాన్యతలు ఐచ్చికాలు మాత్రమే. తప్పనిసరి కాదు.
బ్యాలెట్ పేపర్ మీద ఎలాంటి సంతకం, పేరు, గుర్తులు, అక్షరాలు రాయకూడదు. ఎలాంటి వేలిముద్రలు వేయరాదు.
ఓటరు ప్రాధాన్యతను సూచించడానికి ఎలాంటి గుర్తులు ఉపయోగించినా ఆ బ్యాలెట్ పేపర్ తిరస్కరించబడుతుంది
ఇలా చేస్తే ఓటు చెల్లుబాటు కాదు
ఒక అభ్యర్థి కంటే ఎక్కువ మందికి 1 నమోదు చేసినట్లయితే
అంకెల రూపంలో కాకుండా, అక్షరాల రూపంలో నమోదు చేసినా
ఓటరు గుర్తించబడేలా బ్యాలెట్ పత్రంపై ఏదైనా గుర్తులు, రాతలు ఉన్నా
బ్యాలెట్ పత్రం ఖాళీగా ఉన్నా తిరస్కరిస్తారు.
పోలింగ్కు కాంగ్రెస్ దూరం..
ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది. ఓటింగ్లో పాల్గొనకూడదని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు బహిష్కరిస్తున్నట్లు ఏఐసీసీ సభ్యు డు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం ప్రకటించారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్
జిల్లాకేంద్రంలోని శ్రీ సత్య గార్డెన్స్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘ఎలా ఓటు వెయ్యాలి?’ అనే అంశంపై దిశానిర్దేశం చేశారు. చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లతో మాక్ పోలింగ్, ఓటింగ్ విధానంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు పటిష్ట బందోబస్తు
ఎమ్మెల్సీ ఎన్నికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8 పొలింగ్ కేంద్రాలతో పాటు రూట్ వైస్కు 800 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అదనపు ఎస్పీతో పాటు డీఎస్పీ స్థాయి అధికారులు ఇన్చార్జిలుగా ఉంటారన్నారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తారని చెప్పారు. పోలింగ్ కేంద్రాల మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సీఐ ఆధ్వర్యంలో 20 మంది పోలీసులను కేటాయించామని తెలిపారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులు, డీఎస్పీలు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
మండలి ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు, ఎన్నికల సిబ్బంది , శుక్రవారం ఉద యం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని నంబర్ 1800-452-1939 కు కాల్ చేసి తెలుసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి
మండలి ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అసిస్టెంట్ అధికారి, నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలకనుగుణంగా పోలింగ్ జరుగుతుందని తెలిపారు. కాగా ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు.
ఏర్పాట్లు పూర్తి
ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీవో లోకేశ్వర్ రావు అన్నారు. పోలింగ్ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మొత్తం 102 ఓటర్లు ఉండగా, పురుషులు 43, మహిళలు 59 మంది ఉన్నారన్నారు. ఆయన వెంట తహసీల్దార్ విశ్వంబర్ ఉన్నారు.
పోలింగ్ సెంటర్లు ఇవే..
ఆదిలాబాద్ : పాత జిల్లా పరిషత్ సమావేశ భవనం
ఊట్నూర్ : మండల పరిషత్ కార్యాలయం
మంచిర్యాల : జడ్పీ పాత సమావేశ
మందిరం మొదటి అంతస్తు
బెల్లంపల్లి : ఎంపీపీ సమావేశ భవనం
నిర్మల్ : జడ్పీ కార్యాలయం
భైంసా : మండలపరిషత్ కార్యాలయం
ఆసిఫాబాద్ : జడ్పీ బాలికల పాఠశాల
కాగజ్నగర్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల