గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీక తీజ్. సాంకేతిక యుగంలోనూ గిరిజనులు తమ కట్టుబాట్లు, జీవన విధానాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. ప్రతి శ్రావణమాసంలో నియమ నిష్ఠలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపటి(బుధవారం) నుంచి పొలాల అమావాస్య వరకు దాదాపు తొమ్మిది రోజులపాటు పెండ్లికాని యువతులు, మహిళలు బుట్టల్లో గోధుమలు, శనగలు అలికి ఆలయం వద్ద పందిళ్లపై పెడతారు. రోజూ వాటికి నీరు పోస్తూ.. కూడళ్ల వద్ద ఆడిపాడుతారు. ఈ సందర్భంలో వేషధారణ, చేసే నృత్యాలు విభిన్నంగా, ఆకట్టుకునే విధంగా ఉంటాయి. చివరి రోజు మొలకల బుట్టలను బావులు, చెరువుల్లో నిమజ్జనం చేయడంతో వేడుక ముగుస్తోంది. ఈ వేడుకలతో తండాలు, గూడేలు, పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనుంది. దీంతో ఆడపడుచులకు పెండ్లిళ్లు అవుతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని గిరిజనుల నమ్మకం.
– సారంగాపూర్, సెప్టెంబర్ 4
సారంగాపూర్, సెప్టెంబర్ 4 : కొండలు, కోనలు వాటి మధ్య లో గలగల పారే సెలయేర్లు. పల్లె అందాలను తలదన్నే అందాలు గిరిజన తండాలవి. అక్కడ నివసించే గిరిజనుల ఆచార వ్యవహారాలు, పండుగలు, సంప్రదాయాలు, వస్త్రధారణ, ఆటాపాటలు ప్రతిదీ ప్రత్యేకమే. తండాలలో గిరిజన సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ ఏటా శ్రావణ మాసంలో నిర్వహిస్తారు. గిరిజన తండా ఆడపడుచులు సంప్రదాయ అలంకరణలు, పందిరి వద్ద ఏర్పాటు చేసిన ఊయాలలపై యువతులు, చిన్నారుల కేరింతలతో సందడిగా చేస్తారు. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన ప్రతి గిరిజన కుటుంబీకులు తీజ్, సీత్లా వేడుకలకు తండాలకు వస్తుంటారు.
తొమ్మిది రోజుల పండుగతో అంకురార్పణ
తొమ్మిది రోజులపాటు నిర్వహించే తీజ్(మొలకలు) దాటుడు పండుగ (సీత్లా భవాని పండుగ)తో గిరిజనులు అంకురార్పణ చేస్తారు. బుధవారం నుంచి పండుగను ప్రారంభించనున్నారు. ఈ పండుగ రోజున గిరిజనుల ఆరాధ్యదైవమైన సీత్లా భవాని ఏడు ప్రతి రూపాలకు తండా ఆడపడచులతో క్షీరాభిషేకం చేయిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవార్లకు ప్రత్యేకమైన జొన్నలు, కందులతో చేసిన నైవేద్యం సమర్పించి మేకలను బలి ఇస్తారు. అనంతరం అమ్మవారి నైవేద్యాన్ని తండాల్లోని మూగజీవాలపై చల్లుతారు. ఇలా చేస్తే తండాల్లోని పశువులు, జీవాలకు ఎలాంటి రోగాలు దరిచేరవని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని గిరిజనుల విశ్వాసం. అనంతరం గిరిజనులు సామూహిక వనభోజనాలకు వెళ్తారు. తండాల్లోని పెళ్లికాని యువతులు నానబెట్టిన నవధాన్యాలు మొలకెత్తేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన బుట్టలలో ఆవుపేడ ఎరువుగా వేస్తారు. ఆ బుట్టలను తండాల్లోని ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన పందిళ్లపై పెడతారు. తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్రం పెళ్లికాని యువతులు గిరిజన ఆటాపాటలతో నీరు పోస్తారు. అనంతరం పందిరి సమీపంలో ఏర్పాటు చేసిన ఊయలలో ఊగుతూ పాటలు పాడుకుంటూ ఆ ప్రాంతం వద్దే ఆ యువతులు నిద్రపోతారు. అయితే తీజ్ పండుగలో పెళ్లికాని యువతులు ప్రత్యేక పూజలు చేయడం మూలంగా కచ్ఛితంగా ఆడపడుచులకు పెళ్లిళ్లు అవుతాయని తండావాసుల నమ్మకం.
బుట్టలో మొక్కల పెంపకం..
తీజ్ పండుగలో భాగంగా బుట్టలలో మొలకలను పెంచేందుకు రైతులకు సాగుపై శాస్త్రీయంగా అవగాహన ఉండడంతో వారి సలహాలు, సూచనలు యువతులు పాటిస్తూ మొక్కల పెంపకానికి కృషి చేస్తారు. మొలకల బుట్టలో చల్లిన నవధాన్యాలను తొమ్మిది రోజులపాటు పెంచి పోషిస్తారు. ఈబుట్టలో పెరిగిన నవధాన్యాలతో ఏ విత్తనం బలంగా పెరిగిందో పరీక్షిం చి అదే పంటను చేయాలని పూర్వం తండా పెద్దలు నిర్ణయించేవారు. అవగాహన లేకుండా పంటను వేసి నష్టపోకుండా ఉండేందుకు ఈ పండుగ రూపంలో గోధుమ మొలకలను పెంచుతారు.
కోలాహలంగా నిమజ్ఞనం
బుధవారం నుంచి తీజ్ పండుగ ప్రారంభమై తొమ్మిది రోజులపా టు పూజలందుకున్న మొలకల బుట్టలను చివరి రోజైన పొలాల అమవాస్య రోజు ఉదయం పందిరిపై ఉన్న బుట్టలను కిందికి దించి ప్రత్యేక పూజలు చేస్తారు. తండా కూడలిలో బతుకమ్మ మాదిరిగా పెట్టి డప్పుచప్పుళ్లతో గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తారు. తీజ్ పండుగలో చివరి వేడుకను ప్రధాన ఘట్టంగా భావిస్తారు. బుట్టల్లోని మొలకలను తొలిగించి పురుషుల తలపాగలో పెట్టడం విశేషం. మొక్కలను తొలిగించిన బుట్టలను సమీప వ్యవసాయ బావులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. సోదరులు పెళ్లికాని యువతుల కాళ్లను కడిగి వెంట తెచ్చుకున్న ఆకుకూరలు, జొన్నరొట్టెలు భుజించి ఇంటిదారి పడుతారు.