Tattoo | మంచిర్యాల ఏసీసీ, డిసెంబర్ 18 : ప్రస్తుతం టాటూ ట్రెండ్ నడుస్తున్నది. నేటి ఫ్యాషన్లో అది కూడా ఓ భాగమైంది. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా పచ్చబొట్టు నిలుస్తున్నది. ప్రధానంగా యువత దీనిపై ఎంతో క్రేజ్ చూపిస్తున్నది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు డిఫరెంట్గా కనిపించాలని, కొత్త లుక్ కోసం శరీరంపై టాటూలు వేయించుకుంటున్నారు. సెలబ్రిటీలు, దేవతలు, తమకు ఇష్టమైన వారి పేర్లతో పాటు ఫొటోలు వేయించుకుంటున్నారు.
ముఖ్యంగా ప్రేమికులైతే తమ లవర్ పేరుతో పాటు ఫొటోలను ముద్రించుకొని ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. అలాగే పిల్లలు పుడితే వారి కాలి, చేతి ముద్రలతో పాటు ముఖ చిత్రాలను ఛాతి మీద, చేతి భాగంలో డిజైన్గా వేయించుకుంటున్నారు. కొందరు అమ్మానాన్నల పేర్లు వేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గోగుల రవీందర్ రెడ్డి తనకు ఇష్టమైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోను చేతిపై ముద్రించుకున్నాడు. అలాగే అరబిక్, హిందీ అక్షరాలవంటి డిజైన్లతో టాటుగా వేయించుకుంటున్నారు.
గతంలో టాటూ వేసుకోవాలంటే నగరాలకు వెళ్లాల్సివచ్చేది. గోవా.. తదితర టూర్లకు వెళ్లినపుడు మాత్రమే అది కుదిరేది. నగరాలకే పరిమితమైన టాటూ కల్చర్.. ఇప్పుడు చిన్న పట్టాణాలకు సైతం విస్తరించింది. మంచిర్యాల జిల్లాలో ఎక్కడికక్కడ పదుల సంఖ్యల్లో టాటూ సెంటర్లు వెలిశాయి. ఇంచు డిజైన్ వేస్తే రూ.500, మల్టీ కలర్ అయితే రూ.900, త్రీడీ ఎఫెక్ట్తో వేసుకునే టాటూకి అంగుళానికి రూ.వెయ్యికి పైగా తీసుకుంటున్నారు. మరిన్నీ టాటూలకు సైజులు, డిజైన్లను బట్టి రూ.20 వేల నుంచి రూ. 50 వేల వరకు తీసుకోవడం గమనార్హం.
ప్రస్తుతం మార్కెట్లో నార్మల్, పర్మినెంట్, సెమీ పర్మినెంట్ డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో వృద్ధుల చేతులపై పచ్చబొట్లు మాత్రమే కనిపించేవి. కానీ ప్రస్తుతం మల్టీకలర్స్తో లైఫ్ టైం ఉండేలా టాటూలు అందుబాటులోకి రావడం గమనార్హం.
నేను హైదరాబాద్లో శిక్షణ పొందిన. మంచిర్యాల లో లవీష్ టాటూ సెంటర్ పెట్టుకున్న. మా వద్ద వెరైటీ డిజైన్ల టాటూలు ఉన్నాయి. ఇప్పుడంతా టాటూ క్రేజ్ నడుస్తోంది. యువత నలుగురిలో డిఫరెంట్గా కనిపించ డానికి వేయించుకుంటున్నారు. గిరాకీ బాగుంది.
– జంపాల రవీందర్, టాటు ఆర్టిస్ట్, మంచిర్యాల