ఎదులాపురం, సెప్టెంబర్ 13 : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ప్రత్యేకమైనదని ఆదిలాబాద్ డ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్జ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో భాగంగా జిల్లాస్థాయిలో ఉత్తమ అభివృద్ధి సాధించి ఎంపికైన గ్రామ పంచాయతీలకు జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. గాంధీ కలలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభత్వం గ్రామాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నదన్నారు. పల్లె ప్రగతి, హరితహారం, వివిధ సంక్షేమ పథకాల అమలులో సర్పంచులు, అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలను జాతీయస్థాయిలో గుర్తిం పు వచ్చేలా తీర్చిదిద్దాలన్నారు. జిల్లా స్థాయిల్లో ఉత్తమ జీపీలుగా ఎంపికైన ప్రజాప్రతినిధులు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మరిపోయాయని, నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు తగ్గు ముఖం పట్టాయన్నారు. జిల్లాలో ఉత్తమ అభివృద్ధి సాధించిన జీపీలు 19 ఎంపికయ్యాయని తెలిపారు.
ఈ అవార్డులను పొందిన జీపీలను జిల్లాలోని అన్ని పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామంలో అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలు విధిగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం ఉత్తమ జీపీలుగా ఎంపికైన మండల, గ్రామస్థాయి అధికారులు, సర్పంచులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్త, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.