ACB | కడెం : ఓ రైతు వద్ద రూ..7వేలు లచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఏసీబీకి పట్టబడ్డాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ విజయకుమార్ కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన గుగ్లవత్ ప్రభాకర్ అనే రైతు తన తండ్రి మరణానంతరం 5 ఎకరాల పట్టా మార్పిడీలో భాగంగా కొలతల ప్రొసీడింగ్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
దీనికోసం కడెం మండల రెవెన్యూ సర్వేయర్ ఉమాజీని కలవగా ఎకరానికి రూ.5వేల చొప్పున రూ.25వేలు డిమాండ్ చేసి చివరకు రూ.20వేలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో నుండి రూ.12వేలు గత నెల 28న ఇవ్వగా మరో రూ.8 వేల కోసం నిత్యం వేధిస్తున్నాడు. దీంతో బాధితుడు ప్రభాకర్ ఏసీబీని ఆశ్రయించాడు. కాగా శనివారం రూ.7 వేలు బాధితుడు సర్వేయర్కు ఇస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. నిందితుడు సర్వేయర్ ను అదుపులోకి తీసుకొని తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.