చెన్నూర్, డిసెంబర్ 20: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బస్టాండ్లో బుధవారం విద్యార్థులు ధర్నా చేశారు. జిల్లాలోని కోటపల్లి మోడల్ పాఠశాలకు, జూనియర్ కళాశాలకు చెన్నూర్ నుంచి నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇటీవల మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో, బస్సులు పూర్తిగా రద్దీగా ఉంటున్నాయి.
దీంతో విద్యార్థులు పాఠశాల, జూనియర్ కళాశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపించాలని, ఆర్టీసీ అధికారులను కోరినా, పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా పాఠశాలకు వెళ్లేందుకు రాగా, బస్సులు కిక్కిరిసిపోయాయి. దీంతో బస్టాండ్ వద్దే నిరసన తెలిపారు. వేళకు బస్సులు నడిపించకుంటే, చదువులు మానేసుకొని ఇంటికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.