సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 12 ; సీసీసీ సింగరేణి పాఠశాలలో నిర్వహించి పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం వైభవంగా సాగింది. శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ట్రస్ట్, ముద్రించిన సావనీర్ను ఆవిష్కరించారు. ఈ మహా సమ్మేళనానికి 1978-2022 వరకు చదువుకున్న 3 వేల మంది పూర్వ విద్యార్థులు.., 150 మంది బోధన, బోధనేతర సిబ్బంది హాజరయ్యారు. 44 ఏండ్ల తర్వాత నిర్వహించిన ఇంత పెద్ద వేడుకకు పూర్వ విద్యార్థులు భారీగా తరలిరావడంతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది. మొత్తం 76 బ్యాచ్లకు చెందిన విద్యార్థులంతా ఒక్క చోట కలుసుకొని పాఠశాలలో చదువుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. బాగోగులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయా బ్యాచ్లకు చెందిన చిన్ననాటి స్నేహితులంతా ఫొటోలు, సెల్ఫీలతో బిజీబిజీగా గడిపారు. ట్రస్ట్ ఏర్పాటుకు సహకరించిన దాతలను, తమకు చదువులు చెప్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. పూర్వ విద్యార్థి డప్పు సమ్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ మహా సమ్మేళనంలో పూర్వ విద్యార్ధులంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు.
మధురానుభూతులను పంచిన మహా సమ్మేళనం : జీఎం సంజీవరెడ్డి..
పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం మధురమైన అనుభూతులను గుర్తుచేసుకునే వేదికగా మారిందని శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పిత్తితో పాటు, కార్మికులు, వారి పిల్లల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. కార్మికుల పిల్లలకు ఉన్నత చదువులు అందించేందుకు యాజమాన్యం సింగరేణి వ్యాప్తంగా 19 పాఠశాలలను ప్రారంభించిందని, కాలక్రమేనా కొన్ని మూతపడ్డాయని, ప్రస్తుతం 8 స్కూళ్లు నడుస్తున్నాయని వెల్లడించారు. పాలిటెక్నిక్, ఉమెన్స్ కళాశాలలు నడిపిస్తున్నదని, గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు రూ.500 కోట్లు సాయం చేసిందని చెప్పారు. దేశ విదేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు పాఠశాలను గుడిలా భావిస్తూ ఇక్కడ సమావేశమవడం అభినందనీయమన్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులు, ఆర్థికంగా చదువు కొనసాగించలేని నిరుపేద విద్యార్థుల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్వోటూ జీఎం త్యాగరాజు, డీజీఎం పర్సనల్ గోవిందరాజు, పాఠశాల కరస్పాండెంట్ రాజేశ్వర్, హెడ్మాస్టర్ రాధాకృష్ణమూర్తి, మహా సమ్మేళనం సమన్వయకర్తలు రాజారెడ్డి, వాణిశ్రీ, డీ సమ్మయ్య, విష్ణువర్ధన్రావు, శ్యాంసుందర్రెడ్డి, రవివర్మ, బండారి శారద, జక్కుల మల్లేశ్, డప్పు సమ్మయ్య, గోశిక మనోజ్, బండి రమేశ్ పాల్గొన్నారు.