తాంసి : తాంసి మండలం పొన్నారిలో ఇటీవల మరణించిన ఆర్మీ జవాన్ దాసరి నవీన్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. మొదటి వారి ఇంటినుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. దాసరి నవీన్ అమర్హై… భారత్ మాతాకీ జై… వందేమాతరం… జైజవాన్.. జైకిసాన్ అంటూ యువకులు నినాదాలు చేశారు.దాసరి నవీన్ ఈ సంవత్సరం జూన్ 27న అనారోగ్యంతో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో మృతి చెందాడు.
ఆయన స్మారకార్ధం కుటుంబ సభ్యులు స్వగ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆర్మీ అధికారులు, అమరజవాన్ నవీన్ తల్లిదండ్రులు స్వామి, సువర్ణలతో చేయించారు. కొడుకును తలుచుకుంటు తల్లి ఏడుస్తున్న తీరు అక్కడికి వచ్చిన వారిచేత కన్నీరు పెట్టించింది. ఈ సందర్భంగా రక్తదానం నిర్వహించారు. 20మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్రెడ్డి, ఎంపీటీసీ రేఖారఘు, రిటైర్డ్ ఆర్మీ అధికారుల సంఘం ప్రతినిధులు తిరుపతి, మాజీ సర్పంచ్ భోజన్నయాదవ్, మాజీ ఎంపీటీసీ రమణ, స్థానికులు పాల్గొన్నారు.