ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, డిసెంబర్ 22 : జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న అండర్-14 రాష్ట్రస్థాయి బాల బాలికల ఖోఖో పోటీలు శుక్రవారం ముగిశాయి. అథ్లెటిక్స్ అసోసియేషన్స్ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ ఫైనల్ పోటీలు ప్రారంభించారు. బాలుర విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్-రంగారెడ్డి జిల్లాలు తలపడగా, ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచింది. రెండో స్థానంలో రంగారెడ్డి, మూడో స్థానంలో మెదక్ జిల్లా జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో తుది పోరులో ఉమ్మడి ఆదిలాబాద్-మెదక్ జిల్లా జట్లు తలపడగా, ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచింది. రెండో స్థానంలో మెదక్, మూడవ స్థానంలో ఖమ్మం జట్లు నిలిచాయి.
గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవీటీజీ ప్రాజెక్ట్ అధికారి ఆత్రం భాసర్, ఏసీఎంవో ఉద్ధవ్, గిరిజన సంక్షేమ ఉమ్మడి జిల్లా క్రీడా అధికారి పార్థసారథి, జిల్లా అధికారి బండ మీనారెడ్డి, ఎస్జీఫ్ కార్యదర్శి సాంబశివరావు, క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణారావు, గుర్రాల సురేశ్, హరీశ్, సీ జీ ఎఫ్ రమేశ్, సంధ్య, మల్లేశ్, రవి, శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు మధుసూదన్, విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.