కడెం, డిసెంబర్ 5 : అటవీ ప్రాంతంలోని జీవాలకు గ్రాసం అందేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్ష్మీపూర్ బీట్ పరిధిలో గల ప్రధాన రహదారి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల లోపల అటవీశాఖ గడ్డి పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 2015-16 ఆర్థిక సంఘం నిధుల ద్వారా దస్తురాబాద్ సెక్షన్ పరిధిలోని లక్ష్మీపూర్ బీట్ కంపార్ట్మెంట్ నంబర్ 711లో ఐదు హెక్టార్లలో క్షేత్రం ఉంది. దీని చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అందులో హెట్రోపొగా, ఎమ్మెడా, అసోలిమా, సైమెడాన్, క్లోరిస్బార్బాట, క్లోరిస్విర్గాటా, సెటెరియా ప్యూమెలా, స్కైలో హమాట, ధీననాథ్, డైకాంతియం అనే రకాలకు చెందిన విత్తనాలు చల్లారు. పశు వైద్యాధికారుల సూచనల మేరకు విత్తనాలు తీసుకొచ్చి క్షేత్రంలో చల్లారు. ఇవీ కేవలం నాలుగు నెలల్లో రెండు ఫీట్ల ఎత్తు పెరిగాయి. ఈ ప్రాంతం వన్యప్రాణులకు అనుకూలంగా ఉండడంతో వచ్చి మేసి వెళ్తున్నాయి.
ఐదు గ్రామాల నుంచి జీవాల రాక
లక్ష్మీపూర్ బీట్ పరిధితోపాటు, గంగాపూర్, దస్తురాబాద్, పాండ్వాపూర్, కల్లెడ, కవ్వాల్ అభయారణ్యం పరిధి నుంచి జీవాలు ఈ ప్రాంతాలకు వచ్చి వెళ్తున్నాయి. లక్ష్మీపూర్ బీట్ పరిధిలో పెంచుతున్న గడ్డి పెంపకం కేంద్రాన్ని అటవీశాఖ రేంజ్ అధికారులతోపాటు, ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గడ్డి పెంపకం కేంద్రం వల్ల జీవాలు అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉండే ఆస్కారం ఉండడంతో ఈ క్షేత్రాన్ని మరింత విస్తరించాలని ఉన్నతాధికారులు రేంజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిచ్చి మొక్కల వల్ల వన్యప్రాణులకు అవసరమైన గ్రాసం పెరగదని, అందుకోసం పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. పిచ్చి మొక్కలు తొలగిస్తూ, గడ్డి జాతులు పెరిగేలా సిబ్బంది చూడాలని ఆదేశాలున్నాయి.
తీరనున్న ఇబ్బందులు
లక్ష్మీపూర్ బీట్ పరిధిలో గ్రాసంతోపాటు నీటి కొరత లేకుండా చెరువులు, సాసర్వెల్స్, బోర్లను అధికారులు ఏర్పాటు చేయడంతో వన్యప్రాణులు దాహం తీర్చుకుంటున్నాయి. పిచ్చికుక్కల బెడద నుంచి కాపాడేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. గతంలో తాగునీటి కోసం సమీప గ్రామాలకు వచ్చి, చేదబావుల్లో పడి, రోడ్లు దాటేటప్పుడు వాహనాల కింద పడి మరణించేవి. అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా గ్రాసాన్ని ఏర్పాటు చేసి, తాగునీటిని అందిస్తున్నారు. కాగా.. వన్యప్రాణుల సంరక్షణ కోసం గడ్డి పెంపకం కేంద్రం వద్ద అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. క్షేత్రం పరిసర ప్రాంతాల పరిధిలోకి ఎవరైనా వస్తే రెండు సెకండ్లలో చిత్రాలు తీసేలా ఏర్పాటు చేశారు. రోజూ ఎన్ని రకాల వన్యప్రాణులు వచ్చాయి? ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతానికి వచ్చారా? అనే వివరాలను అధికారులు రెండు రోజులకోసారి పరిశీలిస్తారు. దీంతో వన్యప్రాణులపై దాడులు చేసే ప్రభావం కూడా తగ్గుతుంది. అటవీ సంరక్షణకు కూడా ఉపయోగపడనున్నాయి. కాగా.. లక్ష్మీపూర్ ప్రాంతానికి చుక్కుల దుప్పులు, నీలుగాయిలు, సాంబారులు అధికంగా వచ్చి ఆకలి, దాహం తీర్చుకుంటున్నాయని కడెం ఎఫ్ఆర్వో అనిత తెలిపారు.