సాధారణ ఎన్నికల నాటికి తప్పులు లేని ఓటరు జాబితే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తున్నది. ఈ మేరకు ఓటరు కార్డుతో ఆధార్ను అనుసంధానించడం ద్వారా బోగస్ ఓట్లకు కళ్లెం వేయవచ్చని భావించి, మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజక వర్గాలతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోగల జన్నారం మండలంలో సర్వే ప్రారంభించింది. 780 పోలింగ్ కేంద్రాల పరిధిలోగల ఓటర్ల జాబితాలోని సిమిలర్ ఓట్లను గుర్తించే పనిలో నిమగ్నమైనది. సాంకేతిక విధానంతో రెండు, అంతకన్నా ఎక్కువ ఉన్న వాటిని తొలగిస్తుండగా, ఇప్పటికే 18 మండలాల పరిధిలో 21.06 శాతం సర్వే పూర్తి చేసింది.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 2 : ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకం. ఈ నేపథ్యంలో బోగస్ ఓట్లు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. వాటిని తొలగించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని మూడు నియోజక వర్గాలతో పాటు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజక వర్గం పరిధిలోని జన్నారం మండలంలో సర్వే ప్రారంభించింది. మంచిర్యాల జిల్లాలోని 780 పోలింగ్ కేంద్రాల పరిధిలోగల ఓటర్ల జాబితాలోని సిమిలర్ ఓట్లను బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) గుర్తించే పని మొదలు పెట్టారు. రెండు, అంతకన్నా ఎక్కువ ఓటరు కార్డులపై ఒకే వ్యక్తి ఫొటోలు ఉన్నవాటిని సాంకేతిక విధానాన్ని ఉపయోగించి తొలగించే పనిలో పడ్డారు. అంతేగాకుండా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని, మరణించిన వారిని గుర్తించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. సాధారణ ఎన్నికల నాటికి తప్పులకు తావులేని ఓటరు జాబితా లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 18 మండలాల్లో ఇప్పటి వరకు 21.06 శాతం సర్వే పూర్తయింది.
ఆధార్తో అనుసంధానం
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానించడం ద్వారా బోగస్ ఓట్లకు కళ్లెం వేయవచ్చని ఎన్నికల సంఘం భావించి ఆగస్టు ఒకటి నుంచి రంగం సిద్ధం చేసింది. 2019లోనే ఎన్నికల సంఘం ఆధార్ అనుసంధాన ప్రక్రియను ప్రారంభించినా, పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. ప్రతి ఎన్నికల్లో బోగస్ ఓట్ల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆధార్ కార్డు అనుసంధానం ద్వారా చాలా వరకు నకిలీ ఓట్లకు అడ్డుకట్టవేయవచ్చని భావించి అమలు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు బీఎల్వోలకు అందించారు.
ఇంటింటికీ తిరుగుతూ..
జిల్లాలో 780 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాలకు సంబంధించిన బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆధార్ వివరాలను సేకరిస్తూ సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. బలవంతమేమీ ఉండదని, ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమేనని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా ఈ ప్రక్రియతో ఒక్కరికి ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అలాగే కొత్తగా ఓటరు నమోదుకు కూడా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబర్లో ముసాయిదా ఓటరు జాబితా అనంతరం నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్లో అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తారు. ఫారం – 6బీ దరఖాస్తును ఆన్లైన్, ఆఫ్లైన్లో సమర్పించవచ్చు. eci.gov.in, nvsp.in, voterportal.eci.gov.in, ceotelangana.nic.in తదితర వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఓటర్లు NVSP, VOTER HELPLINE యాప్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు.
సర్వేలో 780 మంది బీఎల్వోలు
జిల్లాలోని మూడు నియోజక వర్గాలతో పాటు జన్నారం మండలంలోని ఓటర్లను సర్వే చేసేందుకు 780 బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) పని చేస్తున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని 1,73,239 మంది ఓటర్లను సర్వే చేసేందుకు 225 మంది బీఎల్వోలు, బెల్లంపల్లిలోని 1,59,659 మంది ఓటర్లకు 222 మంది బీఎల్వోలు, మంచిర్యాల నియోజక వర్గంలోని 2,45, 289 మంది ఓటర్లను సర్వే చేసేందుకు 279 మంది బీఎల్వోలు, ఖానాపూర్ నియోజక వర్గం జన్నారం మండలంలోని 39,362 మంది ఓటర్లను సర్వే చేసేందుకు 54 మంది బీఎల్వోలు పని చేస్తున్నారు. అలాగే పది మంది బీఎల్వోలకు ఒక బీఎల్వో సూపర్వైజర్ను నియమించారు. ఇలా చెన్నూర్ నియోజకవర్గానికి 23మంది, బెల్లంపల్లికి 22 మంది, మంచిర్యాలకు 28 మంది, జన్నారం మండలానికి ఐదుగురి చొప్పున 78 మంది సూప ర్ వైజర్లు పని చేస్తున్నారు. బూత్ లెవల్ అధికారి ఓటరు జాబితాతో ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరించడానికి ఇంటింటికీ సందర్శిస్తున్నారు.
21.06 శాతం సర్వే పూర్తి…
జిల్లాలో ఆగస్టు ఒకటవ తేదీన సర్వే ప్రారంభమైంది. ఇప్పటి వరకు 21.06 శాతం పూర్తయిం ది. జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గంలో 23.51 శాతం, బెల్లంపల్లిలో 35.39 శాతం, మం చిర్యాలలో 12.31 శాతం, ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలంలో 6.74 శాతం సర్వే పూర్తయింది. సర్వేలో ఒక్కో పార్టీ తరపున ఒకరిని బీఎల్వోలకు అటాచ్ చేయడం ద్వారా వంద శాతం తప్పులేని సర్వే పూర్తయ్యే అవకాశం ఉంటుందని, సర్వేకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.