రామకృష్ణాపూర్, జూలై 14 : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు శివారులోని అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన గాంధారి మైసమ్మ, సంతాన నాగదేవతలు కొలువై ఉన్నారు. ఈ నెల 16న ఇక్కడ అంగరంగ వైభవంగా జాతర నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. టెంట్లువేసి బారికేడ్లు ఏర్పాటు చేసింది. జంతుబలుల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ నిర్మించింది. జిల్లా నలుమూలలతో పాటు ఆసిఫాబాద్ జిల్లానుంచి, కోల్ట్ బెల్ట్ ప్రాంతమైన శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి, తాండూర్ గనుల ప్రాంతాల నుంచి కార్మిక కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశమున్నది. మేకలు, కోళ్లు బలి ఇచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకోనున్నారు. మంచిర్యాల డీసీపీ రామనాథ్కేకన్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ సదయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంచిర్యాల నుంచి కోల్బెల్ట్ ప్రాంతమైన మందమర్రి మీదుగా మహారాష్ట్రలోని చంద్రపూర్ వెళ్లే జాతీయ రహదారిపై బొక్కలగుట్ట అటవీ సమీపంలోని పాలవాగు వంతెన వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు. దీంతో బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామస్తులు చారిత్రక గాంధారి కోటలోని మైసమ్మ దేవతకు పూజలు చేసి 19 ఏండ్ల క్రితం ప్రతిష్ఠించారు. అనంతరం గుడి నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. ఆనాటి నుంచి ఆషాఢమాసంలో గాంధారి మైసమ్మ ఆలయానికి వచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తల్లికి నూటొక్క బోనాలతో జాతర నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం ఆచారంగా వస్తుంది.
అటవీశాఖ ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్(నాటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు) బాల్కసుమన్ కృషితో రూ. 3.5 కోట్లతో గాంధారి వనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గాంధారి ఆలయాన్ని ఆనుకొని పాలవాగు, రాళ్లవాగు గలగల పారుతుంది. దీని పక్కన 25 ఎకరాల అటవీ ప్రాంతంలో చిల్డ్రన్ పార్క్, 50 ఎకరాల్లో జింకల పార్కు ఏర్పాటు చేశారు. అంతేగాకుండా 240 ఎకరాల్లో నేచర్ పార్కును అభివృద్ధి చేశారు. నేచర్ పార్కులో నవగ్రహవనం, రాశీవనం, నక్షత్రవనం, ఔషధవనం, స్మృతివనం, పాండ్, వాకింగ్ ట్రాక్లాంటి సౌకర్యాలతో గాంధారివనాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యల తరలివస్తుంటారు.