కౌటాల, జనవరి 28: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని గుట్టపై వెలసిన శ్రీ కంకలమ్మ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లు తున్నది. ఏటా కార్తీక మాసం చివరి ఆదివారం మహా జాతర నిర్వహిస్తారు. జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఏపీ రాష్ర్టాల నుంచి 50 వేల మంది భక్తులు వస్తుంటారు. మూడు రోజుల పాటు ఆలయంలో ఉత్సవాలు నిర్వ హిస్తారు. ఆలయానికి సమీపంలోనే ప్రాణహిత, పెన్గంగ నదులు ఉండడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ ఆలయం పురాతన భారీ రాతి దిమ్మెలతో నిర్మించిన అతి పురాతన కట్టడం. కౌటాల క్షేత్రంలోని దేవాలయాలను కాకతీయుల రాజుల పాలనలో నిర్మించినట్లుగా తెలుస్తున్నది. ఇక్కడి దేవాలయాలు, విగ్రహాలను ముష్కరులు ధ్వంసం చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి.
శక్తి స్వరూపిణి.. జంగుబాయి
కెరమెరి, జనవరి 28: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మం డలంలోని దట్టమైన అడవులు, చుట్టూ గలగలపారే జలసవ్వడి. వాటిని దాటుకుంటూ పోతే ఎత్తైన సహ్వా ద్రి పర్వతం.. ఇందులో ఎన్నో సొరంగ మార్గాలు ఉన్నాయి. ఆ గుహల్లో కొలువైన మహా శక్తి స్వరూపిణి, తల్లి జంగుబాయి. యేటా ఆదివాసులు పుష్యమాసంలో నెలరోజుల పాటు ఇక్కడ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. గోండ్, పర్ధాన్, కొలాం తెగకు చెందిన ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. 8గోత్రాల వారు కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. ఏటా ఈ జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయిస్తున్నది. ఇంటి నుంచి బయలుదేరి పూజల కార్యక్రమం ముగిసే దాకా ఆదివాసులంతా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 60 కి.మీ, కెరమెరి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ జాతరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవచ్చు.
క్వారీ మైసమ్మ జాతర
హాజీపూర్, జనవరి 28: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండ లంలోని ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను ఏటా ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. హాజీపూర్ మండలం గఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో సిమెంట్ రాయి ఉండేది. సిమెంట్కోసం రాయి తీసే సమయాల్లో తరుచుగా ప్రమాదాలు జరుగుతుండేవి. దీంతో మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించి దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఏటా ఆషాఢ మాసంలో ఏదో ఒక ఆదివారం ఈ జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు.
ఎంసీసీ అధికారులు, కంపెనీ సిబ్బంది కుటుంబ సమేతంగా వచ్చి క్వారీలోని దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఇక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేస్తారు. ఇక్కడే నాగదేవత, పోచమ్మ తల్లి ఆలయాలున్నాయి. మంచి ర్యాలతో పాటు బెల్లంపల్లి, మందమర్రి, సిర్పూర్ కాగజ్నగర్, ఆసిఫాబా ద్, మహారాష్ట్ర, గోదావరిఖని తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. మొదటగా కార్మికులు మాత్రమే పాల్గొనే ఈ జాతరను ప్రస్తుతం గఢ్పూర్ ప్రాంతంలోని గిరిజనులు నిర్వహిస్తున్నారు.
అరణ్యంలో వెలిసిన లక్ష్మీ నృసింహ స్వామి
కడెం, జనవరి 28: గోదావరి నదీ తీరాన ప్రకృతి రమణీయంగా స్వయంభూగా వెలిసిన పురాతన దేవాల యం అక్కకొండ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం.. దిల్దార్నగర్ గ్రామ సమీపంలోని అరణ్య ప్రాంతంలోని కొండ గుహలో ఉన్న స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఏటా వైభవంగా నిర్వహించనున్నారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి ప్రారంభమై 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కల్యాణోత్సవానికి ఏటా నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు, ఏపీ, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 5వ తేదీన నిర్వహించే జాతర (రథోత్సవ) కార్యక్రమం ముగిసిన అనంతరం ఇక్కడి నుంచి తిరిగి వెళ్తారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ప్రభుత్వం ఆలయానికి విద్యుత్ సౌకరాన్ని మెరుగుపర్చింది.
రెండో పండరీ పురంతానూర్ క్షేత్రం
తానూర్, జనవరి 28: నిర్మల్ జిల్లాలోని తానూర్ మండల కేంద్రంలో కొలువైన విఠలేశ్వరాలయం రెండో పండరీపు రంగా ప్రసిద్ధిగాంచింది. ప్రతి తొలి ఏకాదశి, కార్తీక ఏకాదశి లకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లిస్తారు. శోభాయాత్రతో పాటు పౌర్ణమి సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 1918లో ఈ జాతర ప్రారంభం కాగా, 105 ఏళ్లుగా వైభవంగా నిర్వహిస్తు న్నా రు. పండరీపురంలోలాగే ఇక్కడ కూడా భక్తులు నియమ నిష్టలతో పూజల్లో పాల్గొంటారు. ఏటా సుమారు 10 వేలమందికి పైగా భక్తులు తరలివస్తారు. కార్తీక మాసం లో నిర్వహించే కుస్తీ పోటీలకు ప్రత్యేకత ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి 70 కిలో మీటర్ల దూరంలో ఉంది, బాసర నుంచి 23కిలో మీటర్ల దూరంలో ఉంటుంది
మహిమాన్వితం.. ఖాందేవ్ జాతర
నార్నూర్, జనవరి 28: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో 11వ దశాబ్ధం పూర్వం తొడసం వంశీయుల ఆరాధ్యదైవం ఖాందేవ్ కొలువుదీరాడు. అప్పటి నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణిమ రోజు మహాపూజలు నిర్వహించి, ఖాందేవ్ ప్రతిమలకు జలాభిషేకం చేసి జాతరను ప్రారంభిస్తారు. మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఏపీ తదితర రాష్ర్టాల నుంచి తొడసం వంశీయులు పాల్గొంటారు. మరుసటి రోజున ఆ వంశం ఆడబిడ్డ నువ్వుల నూనె తాగడం ఆనవాయితీగా వస్తున్నది. విశ్వశాంతిని కోరుతూ సుమారు.2.5కిలోల నువ్వుల తైలాన్ని ఖాందేవ్ సన్నిధిలో ఆ వంశీయుల సమక్షంలో తాగి భక్తిభావాన్ని చాటుతుంది. 15 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. ఇటీవలే మహారాష్ట్రలోని జీవితి తాలుకా పరిధిలోని కొద్దేపూర్ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయి 2.5 కిలోల నువ్వుల నూనె తాగింది.
పూసాయి ఎల్లమ్మ
భీంపూర్(జైనథ్), జనవరి 28: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో నిర్వహించే పూసాయి ఎల్లమ్మ తల్లి జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. వాగుపాయలోనే ఉన్న ఎల్లమ్మకు భక్తులు గారెప్పాలు, నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత మొక్కులు తీర్చుకుంటారు. పుష్యమాసారంభం నుంచి మాఘమాసం వరకు జాతర కొనసాగుతుంది. వాగు చీలిక( పాయ)లోనే గుడి కట్టించారు. సాధారణంగా ప్రతి ఆది,మంగళ, శుక్రవారాల్లో ఎల్లమ్మ తల్లి దర్శనానికి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. ఇక్కడి కోనేరులో స్నానమాచరిస్తే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. కోనేరు నీటిని పొలాల్లో చల్లుతారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 13 కి.మీ దూరంలో ఉన్న పూసాయి ఎల్లమ్మ జాతరకు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లవచ్చు.
అడెల్లి పోచమ్మ ఆలయం
సారంగాపూర్, జనవరి 28: నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ప్రసిద్ధ అడెల్లి పోచమ్మ ఆలయం ఉంది. ఇక్కడ ఏటా అక్టోబర్లో గంగనీళ్ల జాతర నిర్వహిస్తారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. నైవేద్యాలతో పాటు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తారు. అల్లుబండ వద్ద తమ అదృష్టాన్ని భక్తులు పరీక్షించుకుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. ప్రతి ఆదివారం ఈ ప్రాంతం సందడిగా కనిపిస్తుంది. జాతర సమయంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడిపిస్తారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారు.
ముజ్గి మల్లన్న జాతరకు వేళాయె..
సోన్, జనవరి 18: నిర్మల్ మండలంలోని ముజ్గి గ్రామంలో వెలిసిన మల్లన్న జాతర ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రాచీన జాతరలో ఒకటిగా దీనికి పేరుంది. నాగపౌర్ణమి సందర్భంగా ఏటా మల్లన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ముజ్గి మల్లన్న స్వామి విగ్రహాలతో పల్లకీ ఊరేగింపు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, నిజామాబాద్, తదితర ప్రాంతాల్లో పల్లకీ సేవ ద్వారా గ్రామగ్రామాన తిరుగుతారు.
పల్లకీ సేవ గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామంలో రైతులు,యాదవులు మల్లన్నస్వామికి పెరుగు, చల్లంబళ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాగతం పలుకుతారు. కాగా, ఆలయంలో నిర్వహించే జాతరకు ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యాదవ కుటుంబాలు, రైతులు, భక్తులు తరలివస్తారు. రథోత్సవం సందర్భంగా రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడుతారు. మొక్కులు తీర్చుకుంటారు