కడెం, ఫిబ్రవరి 2 : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దిల్దార్నగర్ పంచాయతీ పరిధిలో గల గోదావరి సమీపంలో శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహాస్వామి కల్యాణ మహోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం సమీప గోదావరి వద్ద కల్యాణ అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విశ్వక్సేనా ఆదరణ, ధ్వజారోహణ, అంకురార్పణ, యాగశాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అగ్ని, వైనతేయ ప్రతిష్ఠ కార్యక్రమాలు కొనసాగాయి.
అనంతరం స్వామివారికి ఎదుర్కోలు నిర్వహించి, కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు వంశీకృష్ణాచార్యులు, అజయ్ అచార్య, నవీన్, శ్రీధరచార్య, రమణచార్యులు, సంతోష్, మురళిచార్య, ఆలయ కమిటీ చైర్మన్ జగ్గారావు, ఉత్సవ కమిటీ చైర్మన్ రాజా రమేశ్గౌడ్, సర్పంచ్లు రాజారెడ్డి, విజయస్టెఫెన్, సత్తమ్మ, వివిధ గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహా స్వామి వారి 2023 క్యాలెండర్ను ఆవిష్కరించారు.