నిర్మల్ అర్బన్, డిసెంబర్ 3: జిల్లాలో శాంతి భద్రతలపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ప్రజలందరికీ మెరుగైన పోలీసు సేవలను అందించి జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు 24 గంటల పాటు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం నిఘాను పటిష్టం చేస్తున్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలైన భైంసా, నిర్మల్, ఖానాపూర్తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ను నిర్వహిస్తూ శాంతిభద్రతలను అదుపులో ఉంచుతున్నారు. దీంతో నేరాల శాతం తగ్గడంతో పాటు ఎలాంటి ఆందోళనకరమైన ఘటనలు జరుగకుండా పోలీసుల సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో ఇప్పటి వరకు జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్మల్, భైంసా డీఎస్పీలు సీఐలు, తమ పోలీస్ సిబ్బందితో ఇప్పటి వరకు 58 సార్లు నిర్బంధ తనిఖీ నిర్వహించి శాంతిభద్రతలను అదుపులో ఉంచుతున్నారు.
11నెలల్లో 58 సార్లు తనిఖీలు..
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేపడుతున్న కార్డన్ సెర్చ్ మంచి ఫలితాలను ఇస్తుంది. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ ప్రాంతాలే కాకుండా జిల్లాలోని మారుమూల మండలాలు, అటవీ ఆవాస ప్రాంతాలు, గిరిజన గ్రామాలు పట్టణ కేంద్రాలు ఇలా ప్రతి చోట నిత్యం తనిఖీ చేపడుతున్నారు. తనిఖీల్లో పెద్ద ఎత్తున వ్యాపారులు చేపడుతున్న అక్రమాలు బయటపడుతున్నాయి. ఇందులో నిషేధిత గుట్కా విక్రయం, గంజాయిని సాగుచేస్తూ విక్రయించే వారిని, వివిధ రాష్ర్టాల నుంచి ఇక్కడికి వలస వచ్చి అక్రమ దందాలు, వివిధ కేస్లుల్లో దోషులుగా ఉంటూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులను సైతం ఈ కార్డన్ సెర్చ్తో పట్టుకుని నేరస్తుల భరతం పడుతున్నారు. వివిధ రాష్ర్టాల్లోంచి ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా తలదాచుకుంటున్న వారిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తూ ఇలాంటి వారిపై నిఘా ఉంచుతున్నారు.
అక్రమ మద్యం, గుట్కా, గుడుంబా పట్టివేత..
జిల్లాలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్డన్ సెర్చ్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు, అక్రమంగా మద్యం, రేషన్ బియ్యం, గుట్కా, గుడుంబా, దేశీదారు మద్యం బయటపడ్డాయి. జిల్లాలో 58 సార్లు జరిగిన కార్డన్ సెర్చ్లో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 4350 ద్విచక్ర వాహనాలు, 350 ఆటోలు, 87 ఫోర్ వీలర్ వాహనాలు, రూ.36,900 విలువైన మద్యం, రూ.22 వేల విలువైన గుట్కా, 5500 లీటర్ల గుడుంబా, రూ.1500 విలువ చేసే దేశీదారు స్వాధీనం చేసుకున్నారు.
ముమ్మరంగా తనిఖీలు..అవగాహన కార్యక్రమాలు..
జిల్లాలో పోలీసులు చేపడుతున్న కార్డన్ సెర్చ్కు ప్రజలు పూర్తిగా సహకరిస్తుండడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల అనంతరం గ్రామస్తులు, కాలనీ వాసులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దొంగతనాలు, అనుమానితులు, మద్యం విక్రయాలు, మద్యం సేవించి వాహనాలు నడుపడం, గుర్తు తెలియని వారికి ఇండ్లను అద్దెకు ఇవ్వడం, సోషల్ మీడయాలో వచ్చే వదంతులు, కొత్త వ్యక్తులపై ఆరా, సైబర్ నేరాలు, మూఢ నమ్మకాలు, సీసీ కెమెరాల ఆవశ్యకత, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కలిగే నష్టాలు ఇలా ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగకరంగా ఉండే అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కార్డన్ సెర్చ్తో తనిఖీలతో పాటు అవగాహన కల్పించడంతో పోలీసులకు ప్రజలకు సత్సంబంధాలు కూడా మెరుగవుతున్నాయి.
అక్రమార్కుల గుండెల్లో గుబులు
జిల్లాలో నిరంతరం పోలీసులు అక్కడక్కడ చేపడుతున్న కార్డెన్ సెర్చ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్నది. జీరో వ్యాపారం, నిషేధిత గుట్కా వ్యాపారం,అక్రమ కలప రవాణా, బెల్ట్ షాపుల నిర్వహణ ఇతర వ్యాపారం చేసుకునే వారిలో రైళ్లు పరిగెడుతున్నాయి. జిల్లాలో ఎప్పుడు ఏ ప్రాంతంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపడుతారోనని ఆందోళన చెందుతున్నారు.
మెరుగైన శాంతి భద్రతలను అందించేందుకే..
జిల్లా ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించాలన్న ఉద్దేశ్యంతో జిల్లాలో నిరంతరం కార్డన్ సెర్చన్ చేపడుతున్నాం. కార్డన్ సెర్చ్తో శాంతి నేరాలను పూర్తిగా నివారించేందుకు కృషి చేస్తున్నాము. ఈతనిఖీలకు ప్రజలు పూర్తిగా సహకారం అందిస్తున్నారు.జిల్లా ప్రజలు పోలీసుల సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీ సు శాఖ వారు చెప్పే సూచనలను తప్పకుండా పాటించాలి.శాంతిభద్రతలకు విఘూతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
-సీ.హెచ్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ నిర్మల్