మంచిర్యాల ఏసీసీ, మార్చి 29: గుడ్ ఫ్రై డే ను పురసరించుకొని శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని చర్చిల్లో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి చౌరస్తాలో గల క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో శిలువ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని క్రైస్తవ భక్తులందరూ పాల్గొని ప్రార్థనలు చేశారు. బెల్లంపల్లి చౌరస్తా నుంచి లక్ష్మీ థియేటర్ సరిల్ వరకు శిలువతో యాత్ర కొనసాగింది. అనంతరం బొకలగుట్టలోని రక్షణ కొండపై ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయంలో ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ మిత్రాసనం పీఠాధిపతులు ప్రిన్స్ ఆంటోనీ దైవ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ జోష్ మణికేతన్, యోహాను, సంఘం పెద్దలు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, మార్చి 29: సీసీసీ నస్పూర్లో గుడ్ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం మున్సిపల్ పరిధిలో చర్చిలకు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తును సిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడేగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసుక్రీస్తు త్యాగాలను స్మరించుకున్నారు.
లక్షెట్టిపేట, మార్చి 29: పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో క్రైస్తవులు గుడ్ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి పాస్టర్లు భక్తులకు గుడ్ ఫ్రైడే విశిష్టతను భక్తులకు వినిపించారు. అనంతరం ఒకరికొకరు గుడ్ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు.
కోటపల్లి, మార్చి 29 : గుడ్ ఫ్రైడే వేడుకలను కోటపల్లి మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోటపల్లి, షట్పల్లి, నాగపేట, కొల్లూరు, రొయ్యలపల్లి, బబ్బెరచెలుక గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
భీమారం, మార్చి 29 : మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే వేడుకలను స్థానిక క్యాథళిక్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక చర్చి నుంచి మొదలుకొని బస్టాండ్, ఆవుడం క్రాస్ రోడ్డు మీదుగా 14 స్థలాల్లో శిలువతో నిర్వహించిన యాత్రలో క్రైస్తవులతో పాటు మఠ కన్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ జోబి మాట్లాడుతూ ఏసుక్రీస్తును శిలువ వేసిన ఈ రోజును క్రైస్తవులు గుర్తు చేసుకుంటూ గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. క్రైస్తవులు ఈ రోజును పవిత్ర దినంగా భావించి ఉపవాస ప్రార్థనలు చేస్తారని తెలిపారు.
మందమర్రి, మార్చి 29: గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం మందమర్రి పట్టణంలోని క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పలువురు యువతులు ఆలపించిన గేయాలు అలరించాయి. సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాస్టర్ రెవరెండ్ జెర్మియా పాల్గొని ఏసుక్రీస్తు త్యాగాలను వివరించారు.
రామకృష్ణాపూర్లో..
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 29: ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజును గుర్తు చేసుకుంటూ గుడ్ ఫ్రై డేను రామకృష్ణాపూర్లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సీఎస్ఐ సేయింట్ పీటర్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా, అతిథి పాస్టర్ ఎం. ప్రశాంత్బాబు, మెదక్ డయాసిస్ ప్రొఫెషనల్ ఎడ్యూకేషనల్ కన్వీనర్, రామకృష్ణాపూర్ సీఎస్ఐ చర్చి సెక్రటరీ డొలకల డేవిడ్ దైవ సందేశాన్ని అందించారు. ఏసుక్రీస్తు మానవాళిపై చూపించిన ప్రేమ ఎంతో గొప్పదని విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం క్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశాడని తెలిపారు. ఏసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను ఈ సందర్భంగా ధ్యానించారు. సండే స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక గీతాలను ఆలపించారు. పట్టణంలోని హెబ్రోన్, హల్లెలూయా, బెరకా, బెతేస్థ, బెతేలు, ప్రార్థన మందిరాలతో పాటు తిమ్మాపూర్లోని క్యాథలిక్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కన్నెపల్లిలో..
కన్నెపల్లి, మార్చి 29 : కన్నెపల్లి మండలంలోని ఏసయ్యపల్లెలో గుడ్ఫ్రైడేను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు వేషధారణలో శిలువతో ర్యాలీ తీశారు. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాసిపేట, మార్చి 29 : సోమగూడెం, బెల్లంపల్లి రహదారి మధ్యలోని కల్వరీ మినిస్ట్రీస్ చర్చిలో గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిస్టర్ షారూన్ ఏసు జీవిత చరిత్రను, సందేశాలను వివరించి భక్తులను దీవించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.