మంచిర్యాల అర్బన్, మార్చి 13 : పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 -11వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆరు పేపర్ల విధానం అమలవుతుండడం, పరీక్షల సమయం దగ్గర పడుతుండడంతో వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సా ధించేందుకు, ఒత్తిడికి గురికాకుండా ఉండడానికి సర్కారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ‘అభ్యాస దీపిక’లను తయారు చేసి అమలు చేస్తున్నది. భాషేతర పాఠ్యాంశాల్లోని ప్రధాన అంశాలను సులభతరం చేయడానికి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) బోధన సిబ్బంది, విషయ నిపుణుల బృందంతో తయారు చేయించింది.
గణితం, భౌతిక-రసాయన శాస్త్రం, జీ వ శాస్త్రం, సాంఘీక శాస్త్రం పాఠ్యాంశాల్లోని ప్రతి పాఠంలో ప్ర ధాన అంశాలను పొందుపర్చారు. విద్యార్థులు స్వీయ అభ్యా సం ద్వారా అన్ని ముఖ్యాంశాలను సులువుగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతాయి. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలోని విద్యాలయాల్లో ‘సాధన’, ‘స్టడీ మెటీరియల్’ సత్ఫలితాలిస్తున్నాయి. ఇదే తరహాలో ప్రభుత్వ, జడ్పీ, కేజీబీవీ, మోడల్, ఉర్దూ విద్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఒక్కో దీపికలో 50-60 పేజీలున్నాయి. వార్షిక పరీక్షల్లో పాఠాలవారీగా ఎలాంటి ప్రశ్నలు, బిట్లు వస్తాయి, సమాధానాలు ఎలా రాయాలనే విషయాలు విద్యార్థులకు తెలుస్తాయి. వంద శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
అందరు చదవాలి..
విద్యార్థుల కోసం నాలుగు పాఠ్యాంశాల్లో అభ్యాస దీపికలు వచ్చాయి. వీటిని విద్యార్థులకు అందజేస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. అందరు చదువుకొని నేర్చుకునేలా ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు చూడాలి. 132 పాఠశాలల్లోని 4,871 మంది విద్యార్థులకు గణితం, భౌతిక-రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘీక శాస్ర్తాలకు సంబంధించి ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో సీనియర్ ఉపాధ్యాయులతో తయారు చేయించిన 19,484 అభ్యాస దీపికలు అందజేశాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి, మంచిర్యాల
ఉపయోగకరంగా ఉన్నాయి..
ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన స్టడీ మెటీరియల్ ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ ఏడాది పరీక్షా పేపర్ల సంఖ్య తగ్గించడం వల్ల ఇబ్బంది పడ్డాం. ఈ మెటీరియల్లో పాఠ్యాంశాలవారీగా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీటితో మార్కులు స్కోరింగ్కు మంచి అవకాశం.
– డీ అఖిల, విద్యార్థిని, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, మంచిర్యాల.
మంచి నిర్ణయం
విద్యాశాఖాధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేకుండా అన్ని విషయాలను చక్కగా వివరిస్తూ పొందుపర్చారు. నిష్ణాతులైన వారితో తయారు చేసిన మెటీరియల్ కావడంతో సులభంగా అర్థం చేసుకునేటట్లు తయారు చేశారు. ఉపాధ్యాయుల బోధనకు తోడు ఈ మెటీరియల్ విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు సహాయపడుతాయి.
– జస్వంతి, జడ్పీ బాలికల పాఠశాల, మంచిర్యాల.