ఇంద్రవెల్లి, అక్టోబర్26 : ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన రైతులను వ్యాపారులు మోసగిస్తే చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇంద్రవెల్లి పోలీస్స్టేషన్ను ఎస్పీ బుధవారం తనిఖీ చేశారు. ఠాణా ఆవరణను పరిశీలించారు. సీజ్ చేసిన వాహనాలతోపాటు సమస్యలపై ఆరాతీశారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అన్ని రకాల రికార్డులు పరిశీలించారు. మూడేళ్లకు సంబంధించిన నేరాల వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇంద్రవెల్లి ఠాణాకు వచ్చినట్లు చెప్పారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చే బాధితులను గౌరవించాలని, నేరస్తులపై కేసులు నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేసినా, కేసులు నమోదు చేయని ఎస్ఐలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏజెన్సీలోని వ్యాపారులు ఆదివాసీ గిరిజనులతోపాటు రైతుల నుంచి పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడినట్లు తేలితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తూకాలకు సంబంధించిన అధికారులతో తనిఖీలు చేయిస్తామని, తేడాలు ఉంటే సదరు వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసులతోపాటు పై అధికారుల పని తీరులో మార్పులు ఉండాలన్నారు. ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, సీఐ సైదారావ్, ఎస్ఐ డీ సునీల్ పాల్గొన్నారు.