ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారు.. పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నది. ప్రజారోగ్య పరిరక్షణకు దవాఖానలు ఆధునీకరించి, వైద్యులను నియమిస్తున్నది. ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో బీపీ, మధుమేహం, గుండె జబ్బులకు సంబంధించిన సమాచారం సేకరించి రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. ఈ సమాచారం ఉన్నతాధికారులకు తెలియడం కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వాలని భావించింది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తుండగా..నిర్మల్ జిల్లాలో మంత్రి చేతుల మీదుగా అందజేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది ఆశకార్యకర్తలు ఉండగా.. ఇందులో నిర్మల్ జిల్లాలో 569, ఆదిలాబాద్లో 1,020, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 748, మంచిర్యాలలో 663 మంది ఉన్నారు. వీరందరికీ స్మార్ట్ఫోన్లు ఇవ్వనుండగా.. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందే అవకాశం ఉంది.
నిర్మల్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : ప్రజారోగ్య పరిరక్షణకు సర్కారు కృషి చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించి, తగినంత సిబ్బందిని నియమించి మెరుగైన సేవలు అందిస్తున్నది. ఆరోగ్య సమాచారాన్ని, వైద్య సహాయాన్ని, ఆరోగ్యశాఖ ప్రా రంభించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో ఆశ కార్యకర్తలు కీలకపాత్ర వహిస్తున్నారు. ఇ ప్పటివరకు సేకరించిన వివరాలను రిజిస్టర్లో లిఖితపూర్వకంగా నమోదు చేస్తున్నారు. వివరాలు సేకరించేటప్పుడు, ఉన్నతాధికారులకు నివేదికలు ఇ వ్వాల్సి వచ్చినపుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిని అధిగమించడానికి సర్కారు ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్స్ ఇస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3 వేల స్మార్ట్ఫోన్లు పంపిణీకి సిద్ధం చేయ గా, నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏఎన్ఎంలకు ట్యాబ్లు అందించగా, తాజాగా ఆశలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీతో సమాచారం అంతా ఆన్లైన్లో నిక్షిప్తం కానున్నది.
వైద్యరంగంపై సర్కారు ప్రత్యేక దృషి సారించింది. ఆశ కార్యకర్తలు సేకరించిన సమాచారం రికార్డుల్లో నమోదు చేయడం, అవసరమైనపుడు రికార్డులు తిరిగేయడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యలను అధిగమించేందుకు స్మార్ట్ఫోన్స్ పంపిణీ చేస్తున్నది. ఇందులో గ్రామ, మండల, జిల్లా సమాచారం నిక్షిప్తం చేస్తే రాష్ట్రస్థాయిలో తెలుసుకునే వీలుంటుంది. మీటింగ్లకు రిజిస్టర్లను తీసుకెళ్లే బాధ ఉండదు. అలాగే బీపీ, మధుమేహం, గుండె జబ్బుల వంటి గురించి ముందే స్మార్ట్ఫోన్స్లో పొందుపరచడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. సర్కారు ప్రవేశపెడుతున్న ఆరోగ్య పథకాలు కూడా అర్హులైన వారికి అందుతున్నాయా? లేదా? తెలుసుకునే అవకాశం ఉంటుంది. పనిభారం తగ్గుతుందని ఆశ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3వేల మంది ఆశ కార్యకర్తలు ఉండగా.. ప్రతి ఒక్కరికి అందించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో 569, ఆదిలాబాద్ జిల్లాలో 1,020, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 748, మంచిర్యాల జిల్లాలో 663 అందించనున్నారు. త్వరలోనే మంత్రి అల్లోల చేతల మీదుగా పంపిణీ చేస్తామని నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ధన్రాజ్ తెలిపారు.