జిల్లాలోని మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్న సర్కారు, అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. ఇప్పటికే ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసిన సినిమా థియేటర్ విజయవంతంగా నడుస్తుండగా, దానిని పరిగణలోకి తీసుకొని మండలానికో చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. మండల సమాఖ్య ఆధ్వర్యంలో స్థాపించే యూనిట్కు రూ. 25 లక్షలు, గ్రామైక్య సంఘాల ద్వారా నెలకొల్పే వాటికి రూ. 5 లక్షల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. దాల్మిల్లు, తేనె, పచ్చళ్లు, బిస్కెట్ల తయారీ, సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రికల్ షాపులతో పాటు స్థానిక పరిస్థితులను బట్టి ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించేందుకు సన్నద్ధమైంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ), అక్టోబర్ 20 : జిల్లాలో మహిళా సంఘాలు మరింత ఆర్థిక పరిపుష్టిని సాధించేలా అధికారులు ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సినిమాటాకీస్ ద్వారా మహిళా సంఘాలకు మంచి ఆదాయం సమకూరుతుండగా, మిగతా మండలాల్లోనూ ఆదాయం వచ్చేలా చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే యూనిట్కు రూ. 25 లక్షల వరకు, గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో స్థాపించే యూనిట్లకు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా (స్త్రీనిధి) రూ. 5 లక్షల వరకు చేయూతనందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి మండల సమా ఖ్య ఆధ్వర్యంలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడంతో పాటు ఆసక్తి కనబరిచే గ్రామైఖ్య సంఘాలతో కూడా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.
200 రోజులు రూ.44.37 కోట్లు
జిల్లా కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాకీస్ ద్వారా 200 రోజుల్లో మంచి ఆదాయం వచ్చింది. టాకీస్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.44 కోట్ల 37 లక్షలు వచ్చాయి. ఇటీవల మహిళా సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించిన అధికారులు జిల్లాలోని ప్రతి మండలంలోనూ మహిళలకు ఆదాయం సమకూరేలా ఏదో ఒక యూ నిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
మండలానికో యూనిట్ ప్రారంభించేలా..
ఇప్పటికే సినిమా థియేటర్తో పాటు చిరుధాన్యాల పొడులను తయారు చేసే పరిశ్రమను స్థాపించారు. ఈ యూనిట్లు విజయవంతంగా నడుస్తుండగా, మంచి ఆదాయం సమకూరుతున్నది. ఈ యూనిట్ల స్ఫూర్తితో జిల్లాలోని 15 మండలాల్లో మరిన్ని చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. వాంకిడి మండలంలో తేనె పరిశ్రమ, దాల్మిల్, జైనూర్ మండలంలో సూపర్ మార్కెట్, వాటర్ ప్లాంట్ యూనిట్లు, తిర్యాణిలో పేపర్ ప్లేట్ల పరిశ్రమ, రెబ్బెనలో పచ్చళ్లు, బిస్కెట్ల తయారీ యూనిట్లు, కెరమెరిలో ఎలక్ట్రికల్ షాపువంటి వాటిని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక జిల్లాలోని మిగతా మండలాల్లో అక్కడి పరిస్థితులు, మహిళా సంఘాల ఆసక్తిని బట్టి ఎలాంటి యూనిట్లు పెట్టాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా మండలాల్లో ఉండే వనరులు, మహిళా సం ఘాల ఆసక్తిని బట్టి యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు త యారు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పండే పంటలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. పప్పులు, మిర్చి, పసుపు, పంటలు అధికంగా పండే ప్రాంతాల్లో వాటి ప్రాసెసింగ్ యూనిట్లను ఏ ర్పాటు చేయనున్నారు. ఫ్లోర్మిల్ యంత్రాలు, బేకరీలు, టమాటసాస్లు తయారు చేయడం, మామిడి పండ్లరసాల పరిశ్రమ లు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ముడిసరుకుల సేకరణ, ఇలా ఆ యా ప్రాంతాలను బట్టి ఎలాంటి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అనే దానిని బట్టి ప్రణాళికలు తయారు చేస్తున్నారు.