శ్రీరాంపూర్, డిసెంబర్ 9: సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం(ప్రైవేట్) వేయడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన 72 గంటల సమ్మె గురువారం మొదటి రోజు విజయవంతమైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని 3 డివిజన్లలో కార్మికులు విధులు బహిష్కరించారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూతో పాటు ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ తదితర సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. బెల్లంపల్లి డోర్లి, మందమర్రి, కాసిపేట, రామక్రిష్ణాపూర్, శ్రీరాంపూర్, ఇందారం గనులు, ఓసీపీల్లో కార్మికులు విధులకు హాజరవలేదు. దీంతో సంస్థకు ఉత్పత్తి నిలిచి పోయింది. సింగరేణి వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. శ్రీరాంపూర్ ఏరియాలో గురువారం 22వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. శ్రీరాంపూర్, ఇందారంఓసీపీల్లో 16,000 టన్నులు, 7 భూగర్భ గనుల్లో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి, ఖైరిగూడ ఓసీపీల్లో 12వేల టన్నులు, మందమర్రి ఏరియాలోని 6 భూగర్భ గనులు, 2 ఓసీపీల్లో 17 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మొదటి రోజు 18వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేశారు. అత్యవసర సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు.
సకలజనుల సమ్మె తర్వాత పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొని నిరసన తెలపడం ఇదే మొదటి సారి అని కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు సింగరేణి అధికారులు కూడా ఈ సమ్మెకు మద్దతు పలికారు. బెల్లంపల్లి ఏరియా దవాఖానలో సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రామక్రిష్ణాపూర్ ఓసీపీలో ఓబీ పనులు నిర్వహిస్తున్న మహాలక్ష్మి కాంట్రాక్ట్ కంపెనీ గేట్ ఎదుట జేఏసీ నాయకులు బైటాయించారు. పనులు నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో పనులు నిలిపేస్తున్నట్లు మహాలక్ష్మి కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. శ్రీరాంపూర్లో టీబీజీకేఎస్ నాయకులు కెంగెర్ల మల్లయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీరాంపూర్లో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరభద్రయ్య, ఏనుగు రవీందర్రెడ్డి, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి కొట్టె కిషన్రావు, జిల్లా కార్యదర్శి మేకల దాసు, హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు జీవన్జోయెల్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జే శంకర్రావు, బీఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు పేరం రమేశ్, సీఐటీయూ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రామగిరి రామస్వామి, ఉపాధ్యక్షుడు మిడివెల్లి శంకర్, కార్యదర్శి బాగ్యరాజు, తదితరులు పాల్గొన్నారు.