మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధిలోని దగ్గనేపల్లిలో రెండేండ్ల క్రితం వన్యప్రాణుల కోసం అమర్చిన తీగకు తగిలి పులి చనిపోయింది. వేటగాళ్లు పులి డెడ్బాడీని పాతిపెట్టి, గోరును మాత్రం విక్రయించడానికి ప్రయత్నించగా గత నెల అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. అయితే.. చనిపోయిన పులి రెండేండ్లుగా కనిపించకుండా పోయిన కే-4 అయి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. మహారాష్ట్రకు వెళ్లి వెనక్కి వచ్చిన దాఖలాలు లేవని, వస్తే సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యేదని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందుకే చనిపోయింది మన పులి కాదని, వలస వచ్చిందే అయి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా.. పట్టుబడిన పులి ఎముకలతోపాటు గోర్లను ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం హైదరాబాద్లోని సీసీఎంబీకి పంపించారు. అది వచ్చాకే అసలు విషయం తెలియనుంది.
– మంచిర్యాల, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పులి గోరును విక్రయించేందుకు వాట్సాప్లో ఫొటో పెట్టి.. అటవీ శాఖ అధికారులకు చిక్కిన ముగ్గురు నేరగాళ్ల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధిలోని దగ్గనేపల్లి అటవీ ప్రాంతంలో 2018-19లో వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పులి మృతి చెందింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా ముగ్గురు వ్యక్తులు పులిని పాతిపెట్టారు. అందులో ఒకరైన బాలరాజు పాతిపెట్టిన చోట తవ్వి గోరును బయటికి తీసి దాన్ని విక్రయించేందుకు పెట్టి మార్చి 25వ తేదీన అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు, విచారణలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. వీరి నుంచి పులి గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పట్టుబడిన పులి ఎముకలతో పాటు ఆ గోర్లను ఫొరెన్సిక్ రిపోర్ట్ కోసం హైదరాబాద్లోని సీసీఎంబీకి పంపించారు. అది వచ్చాకే చార్జిషీట్ వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
చనిపోయింది కే -4 కాదు.. కవ్వాల్లోని పులులన్ని సురక్షితం
అయితే చనిపోయిన పులి రెండేళ్లుగా కనిపించకుండా పోయిన కే-4 అయి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది మహారాష్ట్ర వెళ్లిపోయే ముందు నడుముకు తీగ చుట్టుకొని గాయపడడంతో అదే ఈ వేటగాళ్లకు చిక్కి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ కే-4 మహారాష్ట్రకు వెళ్లిపోయి వెనక్కి వచ్చిన దాఖలాలు లేవు. అది వెళ్లిపోయినట్లు మాత్రమే రికార్డు ఉం ది. తిరిగి వస్తే తెలిసిపోయేది. కానీ రాలేదు. పైగా నిందితులు చెబుతున్న 2018-19లో కే-4 యాక్టివ్గా ఉంది.
ఆ తర్వాత కూడా అది ట్రాక్ అయ్యింది. అయితే కే-4 వెళ్లిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అటు కాగజ్నగర్, ఇటు చెన్నూర్లో పులులు వేటికవే టెరిటోరి ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒక పులి ఉన్న ప్రాతంలోకి మరొకటి పొరపాటున కూడా వెళ్లదు. బ్రీడింగ్ (పిల్లలను కనే) సీజన్లో మాత్రమే వెళ్తాయి. ఆ టైమ్లోనే రెండు ఫైటింగ్ చేసుకునే చాన్స్ కూడా ఉం టుంది. అలా వలస వెళ్లిన కే-4 రాలేదు. అది తప్ప మన కవ్వాల్ అభయారణ్యంలో ఉన్న మిగిలిన పులులన్నీ ట్రాక్లో ఉన్నాయి. అవి ఏ యాం గిల్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందనే బ్లాంక్ ఇమేజ్లు వస్తున్నాయి. అందుకే చనిపోయింది మన పులి కాదని అధికారులు చెబుతున్నారు.
కవ్వాల్లోనే కచ్చితమైన ట్రాకింగ్..
కే-4 కవ్వాల్లో ఉన్నన్ని రోజులు ట్రాక్ అయ్యింది. ఎప్పుడైతే అది వెళ్లిపోయిందో అప్పటి నుంచి ఆచూకీ లేదు. ఎందుకంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంద్రావతి అటవీ ప్రాంతంలో కెమెరా ట్రాప్లు లేవు. ఏ టైగర్ రిజర్వ్లో బఫర్లో, బఫర్ బయట, కారిడార్లో కెమెరా ట్రాప్లు పెట్టి టైగర్ ట్రాకింగ్ అనేది చేయరు. కోర్, బఫర్ ఏరియాల్లో మాత్రమే కెమెరాలు పెడతారు తప్పితే, కారిడార్ మొత్తం పెట్టరు.
మన కవ్వాల్లో మాత్రమే కారిడార్ మొత్తం కెమెరాలు ఉన్నాయి. అందుకే ఏ టైగర్ ఎటు వెళ్తుంది. ఆ పులి ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. మిగిలిన రాష్ర్టాల్లో ఆ పరిస్థితి లేదు. ఇంద్రావతి, గడ్చిరోలిలో ఎక్కడా కెమెరాలు ఉండవు. అందుకొని టైగర్స్ను ట్రాప్ చేయడం కుదరదు. అలా కే-4 ఇప్పటి వరకు ట్రాక్ కాలేదని అధికారులు అంటున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక కానీ చనిపోయిన పులి మహారాష్ర్టా నుంచి వచ్చిందా..? లేక ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిందా..? అనేది తెలుస్తుందంటున్నారు. హైదరాబాద్లోని సీసీఎంబీ ల్యాబ్ ప్రస్తుతం రెనువేషన్లో ఉందని, ఆ దృష్ట్యా ఫొరెన్సిక్ రిపోర్ట్ రావడం కొంత ఆలస్యం కావొచ్చంటున్నారు.