మంచిర్యాల, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగమల్లయ్యపల్లెలో సింగరేణి భూమి కబ్జా చేయడమేగాక.. జైపూర్ ఓసీపీ నుంచి వందలాది లారీల్లో మట్టిని తీసుకొచ్చి అక్రమ లే అవుట్ చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. సంగమల్లయ్యపల్లెలో సర్వే నంబర్ 38, 38/ఆ.. లో టీపీ(టెంటిటేటివ్ లే-అవుట్ పర్మిషన్) తీసుకోకుండానే లే అవుట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మున్సిపాలిటీ అనుమతులు వద్దు.. డీటీసీపీకి పోవాల్సిన అవసరం లేదంటూ స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ భర్త తెర వెనకుండి ఈ తతంగమంతా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నాయకుడి అండదండలు ఉండడంతోనే అధికారులు పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నస్పూర్ మున్సిపాలిటీలో ఎంతో డిమాండ్ ఉన్న ఈ ఏరియాలో వెంచర్ వేస్తూ కనీసం నాలా కన్వర్షన్ కూడా చేసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
సంగమల్లయ్యపల్లెలోని సర్వే నంబర్ 38, 38/ఆ.. లలో పెంట మల్లయ్య, పెంట వెంకటి పేర్ల మీద 3.06 ఎకరాల చొప్పున స్థలం ఉంది. అంటే మొత్తం 6.12 ఎకరాలు అవుతుంది. కానీ, ఇది కాకుండా ఐదు గుంటల నుంచి పది గుంటలు సింగరేణి స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఏమిటనేది తేలాల్సి ఉంది. నస్పూర్ పరిధిలోని కృష్ణకాలనీ నుంచి నస్పూర్ చెరువు వరకు మురుగునీరు వెళ్లేందుకు కాలువ కోసం సింగరేణి ఈ వెంచర్ పక్కనుంచి కొంత స్థలాన్ని సేకరించినట్లు తెలుస్తుంది. అలా కాలువ కోసం సేకరించిన భూమిలో దాదాపు ఐదు గుంటల నుంచి పది గుంటల వరకు ఆక్రమించి వెంచర్లో కలిపేసుకున్నట్లు స్థానికులు కొందరు గుసగుసలాడుకుంటున్నారు.
కాగా, ఈ వెంచర్లో పోస్తున్న మట్టి జైపూర్ ఓసీపీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తరలించినట్లు సమాచారం. ఈ విషయమై యాజమానులను వివరణ కోరగా, ఓ కాంట్రాక్టర్ నుంచి ట్రిప్పుకు రూ.3500 ఇచ్చి మట్టి తెప్పిస్తున్నామన్నారు. ఆయన ఎక్కడి నుంచి ఆ మట్టి తీసుకువస్తున్నరో తెలియదు కానీ.. ఇప్పటి దాకా వెయ్యి ట్రిప్పులకుపైగానే మట్టి పోసుకున్నామన్నారు. ఇంకా రెండు, మూడు వందల ట్రిప్పుల మట్టి అవసరం ఉందన్నారు. ఈ విషయమై మట్టి సరఫరా చేసే కాంట్రాక్టర్ సుధాకర్రెడ్డిని సంప్రదించగా.. ఇందారం మండలం రామారావుపేట గ్రామంలో కుమార్ అనే వ్యక్తి మట్టి తవ్వుకునేందుకు అనుమతులు తీసుకున్నారని, అక్కడి నుంచే మట్టి తెస్తున్నామని చెప్పారు.
వాస్తవానికి మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చిన వారిలో కుమార్ అనే పేరే లేదు. ఒకవేళ అనుమతులు ఇస్తే నాలుగు వేల మెట్రిక్ టన్నులు వరకు మాత్రమే ఇస్తామని, అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదని మైనింగ్శాఖ అధికారులే చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 1200 నుంచి 1300 లారీ లోడ్లకు ఒక్కో లారీకి 27 మెట్రిక్ టన్నుల చొప్పున సుమారు 30వేల మెట్రిక్ టన్నులు అవుతుంది. అంతే ఈ మట్టి రైతుల పొలాల నుంచి కాకుండా వేరే దగ్గరి నుంచి వచ్చిందని ఇక్కడే అర్థమైపోతుంది. పైగా మట్టి తెచ్చి పోస్తున్న లారీలకు వే బిల్లులు కూడా లేవు.
దీనిపై సదరు కాంట్రాక్టర్ను వివరణ కోరగా.. వే-బిల్లులు మీకు వాట్సప్లో పంపిస్తామని చెప్పి తప్పించుకున్నారు. కాగా, జైపూర్ ఓసీపీ నుంచే ఈ మట్టి తెచ్చి పోస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఓసీపీ నుంచి తప్ప ఆ స్థాయిలో మట్టి తీసేందుకు జిల్లాలో మరే ప్రాంతంలోనూ అనుమతులు ఇవ్వలేదని మైనింగ్శాఖ రికార్డులే చెబుతున్నాయి. ఓసీపీ నుంచి మట్టి తరలింపుచుకొని వెళ్లడం పెద్ద దందా నడుస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. రూ.3500 ఇస్తే ఎవ్వరికైనా మట్టి వచ్చేస్తుందని చెబుతున్నారు. ఇలా ప్రైవేట్ అవసరాలకు సింగరేణి ఓసీపీ నుంచి మట్టి తరలించడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. కొందరు కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సర్వే నంబర్ 38, 38/ఆ..లో వెంచర్ కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. వాస్తవానికి టీపీ తీసుకున్నాకే డెవలప్మెంట్ పనులు చేయాలి. ఇష్టారాజ్యంగా పని చేయడానికి లేదు. ఈ వెంచర్ విషయం ఇటీవల మా దృష్టికి వచ్చింది. పన్నుల వసూలు కార్యక్రమం కొలిక్కి రాగానే వెంటనే పరిశీలిస్తాం. నిబంధనలు అతిక్రమించిన వారు ఎవ్వరైనా సరే చర్యలు తీసుకుంటాం.
– చిట్యాల సతీశ్, నస్పూర్ మున్సిపల్ కమిషనర్