సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 15: మహిళల భద్రత.. పోలీసుల బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖరెడ్డి పేర్కొన్నారు. గురువారం సీసీసీ నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు షీటీమ్లపై అవగాహన కల్పించారు. సందర్భంగా విద్యార్థినులకు పలు సలహాలు, సూచనలు చేశారు. షీటీమ్ పనివిధానం, మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, తదితర అంశాలపై వివరించారు. బాలికలు, మహిళల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకువచ్చిందని సీపీ వివరించారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే షీటీమ్ను ఆశ్రయించాలని, నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువులు కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. సోషల్ మీడియాలో గుర్తుతెలియని వారితో చాటింగ్ చేయవద్దని, ఇతరులు పెట్టే మెస్సేజ్లకు స్పందించవద్దని సూచించారు. ఆన్లైన్ వేధింపులు, బ్లాక్ మెయిల్ చేయడంవంటి ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించి, అడ్డుకట్టవేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. షీటీమ్ సేవల్లో రామగుండం కమిషనరేట్కు రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో డీసీపీ అఖిల్ మహాజన్, మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, మహిళా స్టేషన్ సీఐ శ్రీనివాస్, మంచిర్యాల రూరల్ సీఐ తోట సంజీవ్, ఎస్ఐలు శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.