కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుతో అంధకారంలో మగ్గుతున్న కర్షకలోకాన్ని వెలుగుల్లోకి తేవాలన్నా.. సాగును పండుగలా మార్చాలన్నా.. ఉచిత కరెంట్, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలు దేశమంతా అమలు కావాలన్నా.. రైతులే కాదు, అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నా.. ఈ మాతృభూమి కోసం ఆలోచించే సమర్థుడైన నాయకుడు రావాలి.. అది తెలంగాణను అన్నింటా ఆదర్శంగా నిలిపిన కేసీఆరే కావాలి.. అని రిటైర్డ్ ఉద్యోగులు, సంఘాల నాయకులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం.. ఇలా అన్ని రంగాలను ప్రగతి పథంలో తీసుకెళ్తున్న ఆయన దేశానికి అవసరమని స్పష్టం చేస్తున్నారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే రైతులే కాదు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలందరికీ మేలవుతుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే రాష్ట్రంలో ఏది జరిగినా దేశ ప్రజల్లో చర్చ జరుగుతున్నదని, ఇదే ఆయన పాలనకు నిదర్శనమని చెబుతున్నారు.
ఆదిలాబాద్ ప్రతినిధి/నిర్మల్, సెప్టెంబరు 13(నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్రాంత ఉద్యోగులకు వెన్నంటే ఉంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సి వచ్చేది. మలి వయస్సులో రిటైర్డ్ ఉద్యోగులు ఎంత తిరిగినా పనులు సరిగా అయ్యేవి కావు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పలు కారణాలు చెబుతూ వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలను అందించడంలో తీవ్ర జాప్యం చేసేవారు. దీంతో విశ్రాంత ఉద్యోగుల పిల్లల వివాహాలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబాల పోషణ కోసం ఆర్థిక పరమైన ఇబ్బందులు పడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన వెంటనే వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ను వెంటనే అందజేయాలని సూచించారు. పదవీ విరమణ రోజు ఉద్యోగులను సన్మానించి, ప్రభుత్వ వాహనంలో వారిని ఇంటివద్ద దిగపెట్టాలని ఆదేశించారు. దీంతో ఉద్యోగులు రిటైర్డ్ అయిన వెంటనే వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందుతున్నాయి.
దేశ స్థితిగతులను మార్చడం కేసీఆర్తోనే సాధ్యం
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 13: ప్రస్తుత తరుణంలో కేసీఆర్లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం. దేశంలో నెలకొన్న సమస్యలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు కేసీఆర్ అని నేను నమ్ముతున్నా. దేశ స్థితిగతులను మార్చే సత్తా ఆయనకే ఉంది. ఎందుకంటే గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనం. కేసీఆర్లాంటి గొప్ప ఆలోచన కలిగిన నేత, ముందుచూపు ఉన్న నాయకుడు దేశానికి అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని యావత్ దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ర్టాల ప్రజలు ఇక్కడకు వచ్చిన సందర్భంలో ఇలాంటి ముఖ్యమంత్రి మాకూ ఉంటే బాగుండు అని మాట్లాడడం చూస్తున్నాం. 60 ఏండ్లలో జరగని అభివృద్దిని ఎనిమిదేళ్లలోనే చేసి చూపించారు. కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దాదాపుగా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం లబ్ధిపొందుతోంది. కరోనా లాక్డౌన్ సందర్భంగా పలు రాష్ర్టాలకు చెందిన కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపించడంతో పాటు వారికి ఆర్థిక సాయం కూడా అందించారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రాణాలు వదిలిన మృతుల కుటుంబాలకు సైతం సాయాన్ని అందించి దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. 24 గంటల కరెంటు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, డబుల్బెడ్రూం, దళితబంధువంటి ఎన్నెన్నో పథకాలు ప్రవేశ పెట్టారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని యావత్ ప్రజానీకం కోరుకుంటున్నది.
– సయ్యద్ ఇంతియాజ్ అహ్మద్, రిటైర్డ్ తహసీల్దార్ (భీమిని), మంచిర్యాల
సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లో రాణిస్తారు
కాగజ్నగర్, సెప్టెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది. అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నది. అరకొరగా ఉన్నా ఆసరా పింఛన్ను అమాంతంగా రూ.2016, రూ.3016కు పెంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచితంగా 24 గంటల కరెంట్, దళితుల అభ్యున్నతి కోసం దళితబంధులాంటి పథకాలు తీసుకొచ్చింది. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంతో చాలా సంతోషంగా ఉన్నారు. కొత్తగా చేనేత కార్మికులకు సైతం పింఛన్ ప్రారంభించారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు అమలు చేసింది లేదు. ఉద్యోగులతో ఫ్రెండ్లీ ప్రభుత్వం కొనసాగుతు న్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లో ప్రవేశించడం మంచి పరిణామం. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయా ల్లో అనుభజ్ఞుడైన నాయకుడు చాలా అవసరం. పట్టు వీడకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ రాణిస్తారు. కాంగ్రెస్ పార్టీపై దేశ ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ఈ తరుణంలో కొత్త పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పార్టీకి బలమైన నాయకత్వం కూడా అవసరం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్నా రాష్ర్టాల్లోనూ ప్రజలకు కావాల్సిన పథకాలు అమలు కాకపోవడం, సుపరిపాలన అందకపోవడం, సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రజలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయ ప్రవేశం చాలా మంచి ఆలోచన. దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తారని నమ్ముతున్నా. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
– మార్త సత్యనారాయణ, విశ్రాంత ఉద్యోగి, కాగజ్నగర్
తెలంగాణలో పెన్షన్ విధానం బాగుంది..
నిర్మల్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ) : ఈనెల 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్లో మూడు రోజులపాటు ఆల్ ఇండియా పెన్షనర్ల ఫెడరేషన్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు 26 రాష్ర్టాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో అన్ని రాష్ర్టాల ప్రతినిధులు తెలంగాణలో అమలవుతున్న పెన్షన్ విధానాన్ని చూసి మెచ్చుకున్నారు. మన రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్తోపాటు మెడికల్ అలవెన్సులు అందడంపై వివిధ రాష్ర్టాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో 70 ఏళ్లు నిండిన వారికి 15 శాతం అడిషనల్ కాంటమ్ ఆఫ్ పే ఇస్తుండగా.. మిగతా రాష్ర్టాల్లో 4 నుంచి 6 శాతం మాత్రమే వస్తున్నది. కొన్ని రాష్ర్టాల్లో అసలే ఇవ్వడం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లపై సీఎం కేసీఆర్ మొదటి నుంచి సానుకూలంగా ఉంటున్నారు. ఇలాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి వస్తే మాలాగే దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు మేలు జరిగే అవకాశముంది. అందుకే కేసీఆర్ భారతదేశాన్ని ఏలాలనేది నా కోరిక.
– బి.కిషన్రావు, రిటైర్డ్ టీచర్, నిర్మల్.
అందరిని ఏకతాటిపైకి తెచ్చే సత్తా కేసీఆర్కే ఉంది..
నిర్మల్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ) : దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు, నాయకులను ఏకతాటిపైకి తెచ్చే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉంది. దేశ ప్రజలను పాలించే పరిపాలనా అనుభవం పుష్కలంగా ఉంది. ఆంధ్రా పాలకుల కుట్రలను తిప్పి కొట్టి.. రానే రాదు అనుకున్న తెలంగాణను కొట్లాడి తెచ్చిన కేసీఆర్కు దేశ రాజకీయాలు చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఆసరా పింఛన్లతోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆర్థిక అండ లభిస్తున్నది. ఇప్పుడు నా వయస్సు 77 ఏళ్లు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఎనిమిదేండ్లలో పెన్షన్ మూడు సార్లు పెరిగింది. 75 ఏళ్లు రాగానే ఏకంగా 20 శాతం పెరిగింది. అందరి సంక్షేమం గురించి ఆలోచించే కేసీఆర్కు దేశ ప్రజలు కచ్చితంగా జేజేలు పలుకుతారు.
– పీ సూర్యకాంతారావు, రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ శాఖ, నిర్మల్.
దేశాన్ని పాలించుడు కేసీఆర్తోనే సాధ్యం
భీమారం,సెప్టెంబర్ 13 : దేశాన్ని పాలించుడు కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. విద్యారంగంపై మన కేసీఆర్కున్న అనుభవం ఎవరికీ లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలను ఓ రిటైర్డ్ ఎంఈవోగా స్వాగతిస్తున్న. తెలంగాణలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టిన ఘనత ఆయనదే. ఎనిమిదేండ్ల పాలనలో విద్యారంగానికి కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసింది. గతంలో ఉన్న ప్రభుత్వాలకంటే ఇప్పుడున్న సర్కారు అధునాతన టెక్నాలజీని తీసుకొచ్చింది. అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియా బోధన లేకుండే. ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఆంగ్ల మీడియం బోధన, డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నది. మన ఊరు-మన బడితో స్కూళ్లు కొత్త రూపును సంతరించుకున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కేసీఆర్ సర్కారు చర్యలు చేపడుతున్నది. మన విద్యావిధానం వేరే రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నది.
– తిరుణాగారి కన్నయ్య, జైపూర్ జడ్పీహెచ్ఎస్ రిటైర్డ్ హెచ్ఎం, ఎంఈవో
భావితరాల కోసం..
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : భావితరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరముంది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ప్రత్యేక తెలంగాణను సాధించిన కేసీఆర్ ఇక్కడ అమలు చేస్తున్న అనేక పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలి. ప్రస్తుతం దేశ పరిస్థితులు బాగా లేవు. పన్నులతో జీవన వ్యయం బాగా పెరిగిపోయింది. పేద, మధ్య తరగతి ప్రజలేకాదు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం.
– ఆడె ప్రకాశ్, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీ హైస్కూల్ కెరమెరి
మంచిగా ఇస్తున్నరు..
నిర్మల్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ప్రదమైన పెన్షన్ పొందుతున్నా. బకాయిలతోపాటు డీఏ కూడా చెల్లించారు. సీఏం కేసీఆర్ ఈ ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా రైతాంగానికి చాలా చేశారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఎరువులు, విత్తనాల కొరత లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. అందుకే దేశంలోని రైతులందరికీ మేలు జరగాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. – ఎం.గోవర్ధన్, రిటైర్డ్ ఎంపీడీవో, నిర్మల్.