నాలుగు బ్లాకుల వేలం నిర్ణయంపై కార్మికులు, కార్మిక సంఘాల ఆగ్రహం
ఆయా చోట్ల ధర్నాలు, ర్యాలీలు కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు
హైదరాబాద్లోని ఆర్ఎల్సీతో జరిపిన చర్చలు విఫలం
శ్రీరాంపూర్/కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 10;సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన సమ్మె శుక్రవారం రెండో రోజూ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్తో పాటు జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు 11 ఏరియాల్లోని కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఆయా చోట్ల ధర్నాలు చేస్తూ ర్యాలీలు తీస్తూ బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనక్కి తగ్గే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్లోని ఆర్ఎల్సీతో జరిపిన చర్చలు కూడా విఫలమవడంతో మూడో రోజూ సమ్మె కొనసాగనున్నది.
బొగ్గు బ్లాకుల వేలం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన 72 గంటల సమ్మెలో రెండో రోజూ విజయవంతమైంది. శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా 3 డివిజన్లలో కార్మికులు గనులకు రాలేదు. అత్యవసర సిబ్బంది మినహా 100 శాతం కార్మికులు సమ్మెలో పాల్గొని మరోసారి కార్మికుల ఐక్యతను చాటారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ కార్మిక సంఘాలతో పాటు విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ తదితర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఒక్క రోజు బొగ్గు ఉత్పత్తి 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా రెండు రోజుల్లో సంస్థకు 2.50 లక్షల టన్నులు, శ్రీరాంపూర్ ఏరియాలో 44 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఓసీపీలు శ్రీరాంపూర్, ఇందారంలో 32 వేలు, 7 భూగర్భ గనుల్లో 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి, ఖైరీగూడ ఓసీపీల్లో 24వేల టన్నులు, మందమర్రి ఏరియాలోని 6 భూగర్భ గనులు, 2 ఓసీపీల్లో 34 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. తూర్పు జిల్లాల్లో గనులు, ఓసీపీల్లో కార్మికులు 18 వేల మంది సమ్మెలో పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేశారు.
శ్రీరాంపూర్లో 44 వేల టన్నుల ఉత్పత్తికి నష్టం
శ్రీరాంపూర్లోని 8గనులు, 2 ఓసీపీలో 10 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 44 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం కలిగింది. శ్రీరాంపూర్లో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు అన్న య్య, మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధులు వీరబభద్రయ్య, ఏ రవీందర్రెడ్డి, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి కొట్టె కిషన్రావు, హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు జీవన్జోయెల్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జే శంకర్రావు, బీఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు పేరం రమేశ్, సీఐటీయూ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రామగిరి రామస్వామి, కార్యదర్శి బాగ్యరాజు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్ శ్రీరాంపూర్ గనులు, ఓసీపీలపై కార్మికులు సమ్మెలో పాల్గొనేలా కృషి చేశారు. అనంతరం శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు.
నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే దివాకర్రావు
శ్రీరాంపూర్ ఎస్ఆర్పీ 1 గనిపై మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కార్మికులు, కార్మిక నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. సింగరేణి గనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర సర్కారుకు సీఎం కేసీఆర్ లేఖ రాశారని చెప్పారు. అయినప్పటికీ కేంద్రం మొండి వైఖరి అవలంబించడం తగదని హెచ్చరించారు. వెంటనే గనుల వేలాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కార్యదర్శి కొమ్ముల శ్రీనివాస్, గరిగె స్వామి, టీబీజీకేఎస్ నాయకులు వెంగళ కుమారస్వామి, బండి రమేశ్, మహిపాల్రెడ్డి, అన్ని గనుల పిట్ కార్యదర్శులు పాల్గొన్నారు.
నిరవధిక సమ్మెకు సిద్ధమవ్వాలి : ఐఎఫ్టీయూ
గనుల వేలం, ప్రైవేటీకరణ రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏఐఎఫ్టీయూ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు కే నర్సయ్య అధ్యక్షతన జరిగిన జనరల్బాడీ సమావేశంలో సూర్యం పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు టీ శ్రీనివాస్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏ వెంకన్న, ఉపాధ్యక్షుడు డీ బ్రహ్మానందం, నాయకులు మల్లేశం, కిరణ్, హరీశ్, తిరుపతి, శ్రీనివాస్, అశోక్, శివ, రాజు, కళ, అనిత, లక్షి పాల్గొన్నారు.
మందమర్రి ఏరియాలో..
మందమర్రి రూరల్, డిసెంబర్ 10 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, బొగ్గు బావుల వేలాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్తో పాటు జాతీయ సంఘాలు చేపట్టిన సమ్మె రెండో రోజు కూడా మందమర్రి ఏరియాలో విజయవంతమైంది. కార్మికులు గనుల వద్దకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్లు కార్మికులు లేక వెలవెలబోయాయి. ఈ సందర్భంగా కార్మిక నాయకులు ఉదయం గనుల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం బైక్ ర్యాలీ చేపట్టారు. రెండు రోజుల్లో మందమర్రి ఏరియాలో 30 వేల టన్నుల ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. రూ. 3 కోట్లను కార్మికులు కోల్పోయారు. మూడో రోజు కూడా సమ్మెను విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు జే. రవీందర్, బడికెల సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఐఎన్టీయూసీ నాయకుడు కాంపల్లి సమ్మయ్య, అన్ని గనుల పిట్ కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్లో..
రామకృష్ణాపూర్ డిసెంబర్ 10 : రామకృష్ణాపూర్లోని గనులు, డిపార్ట్మెంట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఏసీపీ ఎడ్ల మహేశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్మికులు,నాయకులు గనుల వద్దకు చేరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాండూర్లో..
తాండూర్, డిసెంబర్ 10 : బెల్లంపల్లి ఏరియా తాండూర్ మండలంలోని బీపీఏ ఓసీపీ-2లో మొదటి షిఫ్ట్లో 126 మంది కార్మికులకు గాను అత్యవసర సిబ్బంది 12 మంది కార్మికులు హాజరయ్యారు. రెండో షిఫ్ట్లో 29 మంది కార్మికులకు అత్యవసర సిబ్బంది 5 మంది కార్మికులు హాజరయ్యారు. మాదారం సివిల్ కార్యాలయం వద్ద, ఓసీపీ సైట్ ఆఫీస్ వద్ద, వర్క్షాప్, స్టోర్స్, ఓసీపీ కార్యాలయం వద్ద సిబ్బంది కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు. గనుల వద్ద తాండూర్ సీఐ కోట బాబురావు ఆధ్వర్యంలో తాండూరు, మాదారం ఎస్ఐలు కిరణ్కుమార్, మానస, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. నిరసన కార్యక్రమాల్లో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, నాయకులు సంగెం ప్రకాశ్రావు, సంపత్రావు, చంద్రకుమార్, రామారావు, రాజేశం, అన్నం లక్ష్మయ్య, చంద్రయ్య, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం కావాలి
తాండూర్, డిసెంబర్ 10 : ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం కావాలని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగె ఉపేందర్ అన్నారు. మాదారంలో ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో నాలుగు బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి సాగర్గౌడ్, ఇఫ్ట్యూ నాయకులు పోశం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
శాంతిఖని గనిలో..
బెల్లంపల్లిటౌన్, డిసెంబర్ 10 : సింగరేణిలోని నాలుగు బ్లాక్ల బహిరంగ వేలాన్ని నిరసిస్తూ చేపట్టిన 72 గంటల సమ్మె రెండో రోజూ శుక్రవారం బెల్లంపల్లిలో సంపూర్ణంగా విజయవంతమైంది. శాంతిఖని షాఫ్ట్లో అత్యవసర కార్మికులు మినహా ఇతర కార్మికులు విధులకు హాజరు కాలేదు. సివిల్ కార్యాలయంలో కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఏరియా దవాఖానలో ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరు కాలేదు. నిరసన కార్యక్రమాల్లో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, నాయకులు చెవిటి సుదర్శన్, దాసరి శ్రీధర్, స్వరూప, శ్రీనివాస్, అరుణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాసిపేటలో..కాసిపేట, డిసెంబర్ 10 : మందమర్రి ఏరియాలోని కాసిపేట-1, కాసిపేట-2 గనుల్లో రెండో రోజూ సమ్మె కొనసాగింది. కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.