సోన్, జూన్ 15 : పల్లె ప్రగతిలో భాగ్యనగర్ ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ మండలంలోని భాగ్యనగర్ గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి మంత్రి, కలెక్టర్ బతుకమ్మ ఆడారు. జాతీయ జెండాను ఎగురవేశారు. పంచాయతీ కార్మికులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె ప్రగతి ద్వారా నిధులు కేటాయిస్తూ గ్రామాలను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.
జిల్లా ఏర్పాటు తర్వాత కలెక్టర్ కార్యాలయంతో పాటు కలెక్టర్ రావడంతో పరిపాలనపరంగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. గతంలో పారిశుధ్య సిబ్బందికి రూ. 250 ఉన్న వేతనాన్ని సీఎం కేసీఆర్ రూ. 8,500 ఇస్తుండడంతో ప్రతి రోజూ రోడ్లను శుభ్రం చేయడం, ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించడంతో గ్రామాలు పరిశుభ్రంగా కనబడుతున్నాయన్నారు. దీనికి పారిశుధ్య సిబ్బందే కారణమని కొనియాడారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నామని ప్రజలు ఈ నీరు తాగాలని కోరారు. అనంతరం సేవాలాల్, లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ భూమయ్య, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ గోవర్ధన్రెడ్డి, మాజీ ఎఫ్ఎసీఎస్ చైర్మన్ రాంకిషన్రెడ్డి, డీపీవో శ్రీలత, ఆర్డీవో స్రవంతి, పంచాయతీ రాజ్ డీఈ తుకారాం, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సాయిరాం, ఏపీవో తుల రామకృష్ణ, ఉపసర్పంచ్ రాజేందర్, మాజీ ఎంపీటీసీ మహేశ్రెడ్డి, సర్పంచ్లు, నాయకులు విలాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.