మంచిర్యాల అర్బన్, మార్చి 28 : జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు చేపట్టిన 5కే రన్ను కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, డీసీపీ అశోక్కుమార్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ అధికారులతో కలిసి ఉత్సాహంగా పరుగు తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
ఎన్నికల నేపథ్యంలో స్వీప్లో భాగంగా వాక్ టూ పోలింగ్ బూత్, ఓటు వినియోగం, ప్రాముఖ్యత తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 2024, ఏప్రిల్ 1 వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఏప్రిల్ 15లోగా తమ వివరాలను నమోదు చేసుకొని నూతన ఓటరు కార్డు పొందాలని కోరారు. జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు ఓటు వేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అనంతరం అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో..
బెల్లంపల్లి, మార్చి 28 : లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన కోసం గురువారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన 5 కే రన్ ఉత్సాహంగా సాగింది. తిలక్స్టేడియం వద్ద ఆర్డీవో హరికృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. భారీ జాతీయ జెండాతో పాత బస్టాండ్, కాంటా చౌరస్తా, ఏఎంసీ ఏరియా మీదుగా ఏఎంసీ గ్రౌండ్ వరకు సాగింది.
ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు అక్కడ ఓటు ప్రతిజ్ఙ చేశారు. అనంతరం ఆర్డీవో హరికృష్ణ మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వారిపై సీ-విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి, ఎంఈవో మహేశ్వర్రెడ్డి, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల హెచ్ఎం, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
చెన్నూర్లో..
చెన్నూర్, మార్చి 28 : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెన్నూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజేస్తూ చెన్నూర్ పట్టణంలో గురువారం 5కే రన్ నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకో-భ్యవిష్యత్తును చక్కదిద్దుకో అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన రహదారిలో 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్, చెన్నూర్ మున్సిపాలిటీ కమిషనర్ గంగాధర్, యువకులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, రెవెన్యూ, మున్సిపాలిటీ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.