నార్నూర్, జనవరి 27: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులు బాగుపడ్డాయి. రాకపోకలు సాగించడానికి వీలులేని ఎన్నో రహదారులు నేడు తళతళలాడుతూ దర్శనమిస్తున్నాయి. అధ్వానంగా మారిన రోడ్డుపై ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు బారిన పడిన ఘటనలూ ఉన్నాయి. మండలంలోని మాల్కుగూడ రోడ్డుపై కాలినడకా కష్టంగా ఉండేది.
ప్రజల ఇబ్బందులను గమనించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సమన్వయంతో రహదారి అభివృద్ధికి రూ.1.25 లక్షలు మంజూరు చేయించారు. దీంతో మాల్కుగూడ నుంచి మలంగి వరకు ఏడు కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు వేశారు. జడ్పీ చైర్మన్ ప్రత్యేక చొరవతో ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేశారు. బీటీరోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది. ప్రయాణ కష్టాలు తీరడంతో నార్నూర్ నుంచి ఆసిఫాబాద్కు వెళ్లే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు పడ్డాం
మాల్కుగూడ నుంచి మలంగి వరకు రోడ్డు వేయడం సంతోషంగా ఉంది. వర్షాకాలంలో ఇబ్బందులు పడ్డాం. గతంలో పాలకులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. మా బాధ అర్థం చేసుకొని తారు రోడ్డు వేయించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్కు రుణపడి ఉంటాం. ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.
– జాదవ్ కైలాశ్, మలంగి
కష్టాలు తీరాయి
మాల్కుగూడ నుంచి మలంగి వరకు ప్రధాన రహదారి నిర్మాణం పూర్తి కావడంతో మండల ప్రజల కష్టాలు తీరాయి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ చొరవతో రహదారి వేడయడంతో ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– పుసం రూపాబాయి, సర్పంచ్, మలంగి