కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతున్నది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందానా… ఇందులో అందరికీ వాటాలు ఉండడంతో, రాయితీ బియ్యం సరిహద్దు గుంగా మహారాష్ట్రకు చేరుతున్నది. సరిహద్దు గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్లా బియ్యం కొనుగోలు చేయడానికి దుకాణాలే వెలిశాయి. ఇక ఇక్కడి నుంచి సరిహద్దు దాటిన బియ్యం అక్కడి రైస్ మిల్లర్లు తీసుకొని పాలిష్ చేయడం, సన్న బియ్యంలో కలపడం చేస్తున్నారు. అయితే పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ విషయంలో నిఘా పెట్టినప్పటికీ, బియ్యం సరిహద్దులు దాటడం మాత్రం ఆగడం లేదు.
సిర్పూర్-టీ మండలంలోని వెంకట్రావ్ పేట్ నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే పెన్గంగ ఉంటుంది. నది ఒడ్డున పోడ్సా గ్రామం మహారాష్ట్రలోనిది. ఇక్కడి బియ్యాన్ని తీసుకోవడానికి అక్కడ నాలుగు భారీ దుకాణాలను ఏర్పాటు చేశారు. రెండు రోజులకు ఒక లారీ(సుమారు 30 టన్నులు) బియ్యం పోడ్సా గ్రామానికి జిల్లా నుంచి చేరుకుంటున్నాయి. పోడ్సాలో కొనుగోలు చేసిన బియ్యాన్ని మరో 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న బంగారు తలోడి, గోండ్ పిప్రికి చేరుస్తారు. ఇక్కడ రైస్ మిల్లుల్లో వీటికి పాలిష్ చేసి మళ్లీ ప్యాక్ చేసి, రాష్ర్టానికే చేరవేస్తున్నారు. మరో మార్గంలో రాజురా, వీరూర్, చంద్రాపూర్కు పీడీఎస్ బియ్యం అధికంగా వెళ్తున్నది.
జిల్లాలోని చాలా గ్రామాల్లో రేషన్ లబ్ధిదారులు చౌక ధరల దుకాణాల వద్దే డీలర్లకు నేరుగా కిలోకు రూ. 10 నుంచి రూ. 12 కు బియ్యాన్ని విక్రయిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యం మహారాష్ట్రలో రూ. 18 నుంచి రూ. 22కు విక్రయిస్తున్నారు. ఇక్కడ పాలిష్ చేసి, ప్యాక్ చేసిన అనంతరం కిలోకు రూ. 40 నుంచి రూ. 50 వరకు అమ్ముతున్నారు. కాగజ్నగర్ అడ్డాగా ఇటు మంచిర్యాల, బెల్లంపల్లి రెబ్బెన నుంచి, మరో వైపు ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్-టి మీదుగా చౌక బియ్యం పొరుగు రాష్ర్టానికి తరలుతున్నది. జిల్లాలో కొంత మంది వ్యాపారులు ఇదే ప్రధాన వ్యాపారంగా చేసుకున్నారు.
జిల్లా నుంచి అక్రమంగా మహారాష్ట్రకు తరలుతున్న బియ్యాన్ని పట్టుకునేందుకు ఎక్కడా చెక్పోస్టులు లేవు. ఒక్కోచోట పట్టుకున్నా ఆ తర్వాత ‘మాములుగా’ తీసుకొని వదిలేస్తున్నారు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అధికంగా ఈ వాహనాలు సరిహద్దు దాటుతున్నాయి. ఇలా అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న బియ్యం ఇప్పుడు అధికారుల వద్ద 3373 క్వింటాళ్లు ఉన్నదంటే, జిల్లాలో అక్రమ బియ్యం దందా ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.