ఉట్నూర్, జనవరి 23: ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు అధికారులు అభివృద్ధే మంత్రంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. స్థానిక కుమ్రం భీం కాంప్లెక్స్లోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో విద్య, వైద్యం, రవాణ, నీటిసరఫరా, విద్యుత్ వంటి సౌకర్యాల కల్పనకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందిచే దిశగా ప్రభుత్వ పథకాలు అమలు కావాలని సూచించారు. కుమ్రం భీం, హైమన్ డార్ఫ్, బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాల వారీగా సాగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, గడ్డం వినోద్, కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్, వెడ్మ బొజ్జు, నాలుగు జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, బదావత్ సంతోష్, హేమంత్ బోర్కడే, రాహుల్, దీపక్ తివారీ, ఫైజల్ అహ్మద్, ఉమ్మడి జిల్లా అటవీ అధికారులు ప్రశాంత్ బాజీరావు పాటిల్, శివ్ ఆశిష్, నీరజ్, రాంకిషన్, తదితరులున్నారు.