మంచిర్యాల అర్బన్/నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 11 : మంచిర్యాల జిల్లాలో తొమ్మిది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మంచిర్యాల, జైపూర్, కోటపల్లి, బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో బాలుర.. బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, లక్షెట్టిపేటలలో బాలికల గురుకులాలున్నాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడలో బాలుర.. బోథ్, ఆదిలాబాద్లలో బాలికల.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్(టీ), కాగజ్నగర్, రెబ్బెనలలో బాలికల.. ఆసిఫాబాద్, సిర్పూర్(టీ)లలో బాలుర విద్యాలయాలున్నాయి.
ఒక్కో గురుకులంలో 80 సీట్లు..
ఒక్కో గురుకులంలో 80 సీట్లు ఉంటాయి. మంచిర్యాల జిల్లాలోని తొమ్మిది గురుకులాలతోపాటు కుమ్రం భీం ఆసిఫాబాద్లోని ఐదు, ఆదిలాబాద్ జిల్లాలోని మూడు గురుకులాలు కలుపుకొని 17 గురుకులాల్లో 80 సీట్ల చొప్పున 1,360 సీట్లు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. ఇందులో ఒక్కో గురుకులంలో ఎస్సీలకు 65 సీట్లు, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు 15 సీట్ల చొప్పున కేటాయించారు. ఒక్కసారి అడ్మిషన్ పొందితే పదో తరగతి వరకు హాస్టల్ వసతితో కూడిన బోధన ఉంటుంది. బట్టలు, బుక్స్, కాస్మోటిక్ చార్జీలతోపాటు అన్ని వసతులు ఉంటాయి. ఒక ఫోన్ నంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలి. ఇతరుల ఫొటోలు పెట్టి దరఖాస్తు చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
పాత జిల్లాను ఒక యూనిట్గా..
గురుకులాల్లో చేరేందుకు 2022-23 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. పాత జిల్లా(ఆదిలాబాద్)ను ఒక యూనిట్ తీసుకొని ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు మార్చి ఆరో తేదీలోపు రూ.100 చెల్లించి వెబ్సైట్(http://tswreis.ac.in, http://tgtwgurukulam.telangana. gov.in, http://tgcet.cgg.gov.in) లేదా http://mjptbcwreis.telangana.gov.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సమాచారం కోసం హెల్ప్లైన్(1800 425 45678)లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. – -కొప్పుల స్వరూపారాణి, ఆర్సీవో,టీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ, ఆదిలాబాద్.