కాసిపేట, జూలై 16 : ప్రజల భద్రత, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో దేవాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో మంచిర్యాల మెడీలైఫ్, సన్రైజ్ దవాఖానల వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించగా, విశేష స్పం దన లభించింది. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ, డీసీపీ భాస్కర్కు మహిళలు తిలకం దిద్ది, తలపాగా చుట్టి, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాల నడుమ వారిని వేదిక మీదికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా దేవాపూర్ ఎస్ఐ గంగారాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు ఐక్యంగా ఉంటూ ప్రగతి వైపు అడుగులు వేయాలని సూచించారు. యువతతో పాటు కుటుంబ సభ్యులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ ఉన్నవారే వాహనాలు నడపాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించిన వైద్యులు, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ పెద్దలు, గ్రామస్తులను అభినందించారు.
ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్, పల్మనాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, కంటి వైద్య నిపుణులు సేవలందించారు. బీపీ, రక్తంలో చకెర పరీక్ష, ఈసీజీ, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ పర్స రమేశ్, దేవాపూర్ ఎస్ఐ గంగారం, కాసిపేట ఎస్ఐ ఆంజనేయులు, మందమర్రి ఎస్ఐ నరేశ్, రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్, మెడీలైఫ్, సన్ రైజ్ హాస్పిటల్స్ వైద్యులు కుమార స్వామి, గౌతమ్, సిరిపురం శ్రీనివాస్, అభిన య్, బోస్, స్వాప్రిక, రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.