ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
జునోని, చాంద్పల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి పనుల పరిశీలన
బేల, జూన్ 7 : ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బేల మండలంలోని జునోని, చాంద్పల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, మన ఊరు-మన బడి కింద చేపడుతున్న పాఠశాలల మరమ్మతులను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమవుతాయన్నారు.
హరితహారం నిర్వహణకు ప్రతి నర్సరీలో 11 వేల మొక్కలు పెంచుతున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో కలెక్టర్ మొక్కలను నాటారు. ఇప్పటికే గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను చిట్టడవిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంపీవోలు, సర్పంచులకు శిక్షణ నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలకు అవసరమైన భూములను గుర్తించి, ఏర్పాటు చేస్తున్నామన్నారు. మన ఊరు- మన బడి మొదటి విడుత కింద జిల్లాలో చేపట్టిన పాఠశాలల మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న మూడేండ్లలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. బడిబాట విజయవంతంగా నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ సీఈవో గణపతి, మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎంపీడీవో భగత్ రవీందర్, జునోని, చాంద్పల్లి సర్పంచులు వివేక్, జంగ్శౌవ్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.