బాసర, జూన్ 26 : తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల నిర్వహించుకున్న విద్యా దినోత్సవానికి కొనసాగింపుగా సోమవారం బాసర ఆర్జీయూకేటీలో ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి, భైంసా ఏఎస్పీ శ్రీకాంత్ లాల్ పాటిల్ హాజరయ్యారు. ఇందులో భాగంగా పరిపాలనా భవనంలో 500 ల్యాప్టాప్లతో కంప్యూటర్ సెంటర్ను వీసీ వెంకటరమణ ప్రారంభించారు. అనంతరం కాంపిటేషన్ ఎగ్జామ్ రీడింగ్ రూం, ఐపీఆర్ సెల్ను కూడా ప్రారంభించారు. అలాగే సైన్స్ బ్లాక్, ఎగ్జామినేషన్ బ్లాక్లకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో గల యోగా హాల్లో ఏర్పాటు చేసిన పోస్టర్ ప్రజెంటేషన్ను విద్యార్థులు వివరించగా, అతిథులు అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ.. ప్రగతి నివేదికలను వివరించారు. అలాగే ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్జీయూకేటీ బాసరను 2008లో అప్పటి ప్రభుత్వం పేద గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిందన్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక మంది పేద విద్యార్థుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించిన విద్యార్థులు వివిధ స్థాయి, రంగాల్లో ఉద్యోగులుగా తమ లక్ష్యాలను చేరుకుంటున్నారని పేర్కొన్నారు. దానికి ప్రభుత్వం పరంగా కేటాయిస్తున్న నిధులు, అందించాల్సిన సహాయ సహకారాలన్నీ ఉన్నాయన్నారు.
ఈ విద్యా సంస్థలోనివిద్యార్థులు అవార్డులను పొందుతున్నారని, మంచి ప్లేస్మెంట్తో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. వీసీగా వెంకటరమణ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్జీయూకేటీ బాసరలో అనూహ్యమైన మార్పులు చేర్పులు కనబడుతున్నాయన్నారు. ఆయన ఈ విశ్వవిద్యాలయాన్ని ఉన్నత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. అనంతరం వీసీ వెంకటరమణ మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో ఉన్నత విద్యా సంస్థగా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ఐటీ హెచ్వోడీలు, సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.