గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన క్రీడలు.. స్వరాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేశాయి. ఉట్నూర్ లాంటి చిన్న ప్రాంతాల్లోనూ రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడంతో పాటు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయడంతో గిరి పుత్రులకు ప్రోత్సాహం దక్కింది. నైపుణ్యానికి టెక్నిక్ తోడైతే ఆటలో తిరుగుండదని గిరి బిడ్డలు నిరూపిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. ఐటీడీఏ సహకారం, నిపుణులైన కోచ్ల పర్యవేక్షణలో పతకాల వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణ వచ్చాక ఏజెన్సీలో క్రీడారంగంలో వచ్చిన మార్పు పై కథనం..
– ఉట్నూర్, ఆగస్టు 27
Sports schools | ఉట్నూర్, ఆగస్టు 27: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదు. వాగులు, వంకలు ఉండడంతో బడికి వెళ్లని పిల్లలు చాలా మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గిరిజన బిడ్డలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. గిరిజన గురుకులాలు డిగ్రీ వరకు ఏర్పాటు చేసింది. దీంతోపాటు గిరిజన ప్రాంతంలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీసి బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏజెన్సీలో క్రీడాపాఠశాలలను నెలకొల్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేస్తే, అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు ఉన్నాయి. జాతర్ల గ్రామంలో బాలురకు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో బాలురకు అథ్లెటిక్స్, హాకీ, ఖోఖో, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బాలికలకు అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, ఖోఖోలపై శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులకు ప్రత్యేకమైన మెనూ పాటిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నారు. అలాగే షూ, దుస్తులు కూడా అందిస్తున్నారు.
200 మందికి రాష్ట్రస్థాయి పతకాలు
ఉమ్మడి జిల్లాలో మూడు క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేసి, ఎన్ఐఎస్ కోచ్లను నియమించింది. దీంతో ఏకంగా రాష్ట్ర స్థాయిలో 200 పతకాలు ఐటీడీఏకు సాధించి పెట్టారు. దీంతో ప్రభుత్వం ఐటీడీఏ ఆధ్వర్యంలో విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు అధునాతన జిమ్లతో పాటు పరికరాలను పెంచారు. 400 మీటర్ల ట్రాక్, అన్ని వసతులతో కోర్టులు ఏర్పాటు చేశారు. రాణించిన విద్యార్థులతోపాటు కోచ్లకు ప్రత్యేక అవార్డులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పోటీల్లో పాల్గొనేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ప్రతిభ చూపుతున్న విద్యార్థులు
గిరిజన క్రీడా పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులు అథ్లెటిక్స్, ఖోఖో, హ్యాండ్బాల్, హాకీ క్రీడల్లో సత్తా చాటుతున్నారు. జాతర్ల క్రీడాపాఠశాలలో మడావి రాము లాంగ్ జంప్, మడావి జగ్జీవన్ హర్డిల్స్, శ్రీకాంత్ జావెలిన్, సచిన్ హైజంప్, ప్రవీణ్ 600 మీటర్ల పరుగు పందెం, చంద్రకాంత్, అజయ్, కార్తిక్లు పరుగులో రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. పలుమార్లు బంగారు, వెండి పతకాలు సాధించడమే కాకుండా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. మరికొంత మంది విద్యార్థులు ఇస్తారి, వెంకటేశ్, నివాస్, సీతారాం, సురేశ్ కూడా ప్రతిభ చూపుతున్నారు. ఉట్నూర్ క్రీడా పాఠశాలలో పెందూర్ సతీశ్, రాథోడ్ విక్రం పరుగు పందెంలో సత్తా చాటి జాతీయస్థాయిలో ప్రతిభ చూపేందుకు వేచి ఉన్నారు.
రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు, ఐఎస్ఎల్ పోటీల్లో ప్రథమ స్థానం నిలవడంతో ఉట్నూర్ పాఠశాలకు చెందిన క్రీడాకారులు నరేశ్, నవీన్ కుమార్, అంజన్న కీలకంగా మారారు. ఇక రాష్ట్రస్థాయిలో ఆడిన జట్టులో 12 మందికి 8 మంది ఈ పాఠశాల నుంచే ఉండడం విశేషం. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో నిర్వహించిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో రూప్దేవ్ తెలంగాణకు ప్రాతినిథ్యం వహించాడు. అదే విధంగా రాష్టస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయస్థానం సాధించడంతో ఉట్నూర్ క్రీడా పాఠశాల విద్యార్థులు ప్రత్యేక పాత్ర పోషించారు. ఇందులో 18 మంది సభ్యులు ఉండగా 12 మంది ఈ పాఠశాల విద్యార్థులు ఉండడం గమనార్హం. ఇక ఆసిఫాబాద్ బాలికల క్రీడా పాఠశాల విద్యార్థులు శరణ్య, సాక్షి, అంజలి, పెందూర్ తీర్థబాయి, అంజతి, శిరీష, నందిని జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాల వేటలో ఉన్నారు.
ప్రత్యేక శిక్షకులు
అయితే విద్యార్థుల విజయాలను వెనుక నుంచి నడిపిస్తున్నది శిక్షకులే. ఐటీడీఏ అధికారులు ప్రతిభ గల శిక్షకులను ఎంపిక చేయడమే విద్యార్థుల విజయాలకు కారణం. జాతర్ల క్రీడాపాఠశాలల్లో లక్ష్మీరాం(అథెటిక్స్), మనోజ్(కబడ్డీ), కార్తి(వాలీబాల్), ఉట్నూర్ క్రీడాపాఠశాలలో సునంద్(అథ్లెటిక్స్), శివ(ఖోఖో), శేఖర్(హాకీ), ఆసిఫాబాద్లో విద్యాసాగర్(అథ్లెటిక్స్), అరవింద్(హ్యాండ్బాల్), తిరుమలేశ్ (ఖోఖో)లు కోచ్గా ఉత్తమ సేవలు అందిస్తున్నారు.
క్రీడా పరిమితులు పెంచుతాం..
గిరిజన విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ఐటీడీఏ పరిధిలో మూడు క్రీడా పాఠశాలలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనుకున్న దానికంటే ఎక్కవ స్థాయిలో ఫలితాలు వచ్చాయి. దీంతో పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మామిడిగూడలో బాలికల కోసం క్రీడా సెంటర్ను త్వరలో నెలకొల్పుతాం.
– దిలీప్ కుమార్, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు, ఉట్నూర్ .
అధికారుల ప్రోత్సాహంతో సత్ఫలితాలు
ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మూడు క్రీడా పాఠశాలల్లో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులున్నారు. వారితోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించాం. విద్యార్థులు, కోచ్లు చాలా శ్రమిస్తున్నారు. కొల్కతాలో జరిగిన జాతీయస్థాయి పోటీలకు క్రీడాకారులను ఐటీడీఏ అధికారులు విమానంలో తీసుకెళ్లారు. క్రీడలలో రాణించేందుకు అధికారులు అవసరమైన అధునాతన జిమ్స్, పరికరాలు, పౌష్టికాహారం అందుబాటులో ఉంచుతున్నారు. అందుకే మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మరిన్ని పతకాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఐటీడీఏకు అందిస్తాం.
– పార్థసారథి, జిల్లా గిరిజన క్రీడల అధికారి, ఉట్నూర్