మంచిర్యాల ఏసీసీ, నవంబర్ 30 : ఎయిడ్స్ ప్రాణాంతకమైన మహమ్మారి. మందులేని ఈ మాయరోగం కంటి మీద కునుకులేకుండా చేసింది. అవగాహన లోపం నిర్లక్ష్యం మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, సామాజిక చైతన్యంతో రాను రానూ ఎయిడ్స్ రోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం..
రోగాన్ని గుర్తించడమెలా..
హెచ్ఐవీ (హ్యూమన్, ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్) ను గుర్తించడానికి ఏఆర్టీ సెంటర్లో కొంబెడ్స్, టై లైన్, టై స్పాట్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో పాజిటివ్ వచ్చినైట్లెతే హెచ్ఐవీగా నిర్ధారిస్తారు. దీర్ఘకాల విరోచనాలు, జ్వరం, ఎడతెరిపి లేని దగ్గు, చర్మ వ్యాధులు, గొంతు నొప్పి ఎక్కువ రోజులు ఉన్నైట్లెతే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలి. నెల రోజుల్లో శరీర బరువులో 10 శాతం తగ్గినా, నెల రోజులకు మించి జ్వరం, విరోచనాలు బాధించిన హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే సీడీ – 4 టెస్టులో తెల్ల రక్త కణాల సంఖ్య 350 కంటే తక్కువగా ఉంటే వారికి జీవిత కాలం పాటు ప్రతి నెలా ఉచితంగా మందులు అందిస్తారు.
1983లో..
ఎయిడ్స్ నివారణకు అప్రమత్తతే అసలైన మందు. ఈ వ్యాధి ఉనికిని 1983లో ల్యూక్మాంటగ్నాయర్ అనే శాస్త్రవేత్త ప్యారీస్లో కనుకొన్నారు. 1984లో అమెరికాకు చెందిన రాబర్ట్గాలో అనే శాస్త్రవేత్త రిట్రావిండే అనే వైరస్ కుటుంబంలోని లెంటి వైరస్ తరగతికి చెందిన ఆర్ఎన్ఏ(రైబాన్యూక్లియిక్ ఆమ్లం)గా గుర్తించారు. ఈ వైరస్ స్వతహాగా కొత్త వైరస్లను సృష్టించలేదు. తనంతట తాను ప్రత్యుత్పత్తి చేసుకోలేదు. కానీ, మానవ శరీరంలోని కణాలలో ఆశ్రమం ఏర్పర్చుకుని ఆ జీవకణ యంత్రాంగం సహాయంతో ప్రత్యుత్పత్తి చేస్తుంది. ఈ వైరస్ ఆకృతి అస్థిరంగా ఉండడం వల్ల మందులకు లొంగదు. రివర్స్ ట్రాన్స్క్రిప్టెజ్ అనే ఎంజైమ్ కారణంగా హెచ్ఐవీ వైరస్ ఆకారాలను మారుస్తుంది. మానవ రోగ నిరోధక శక్తిని తగ్గించే ఈ వైరస్, 120నానో మీటర్ పరిమాణంలో కనిపించే సూక్ష్మ జీవి. ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. శారీరక సంబంధాల నియంత్రణ, ఇతర స్వీయ జాగ్రత్తలతో ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
ఏబీసీ సూత్రాలను పాటించాలి..
హెచ్ఐవీ బారిన పడకుండా ఉండాలంటే ఏబీసీ సూత్రాలను పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఏ-ఏబిస్టినెన్స్ (వివాహానికి ముందు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండడం), బీ- బీ ఫెయిత్ ఫుల్ టూ లైఫ్ పార్టనర్ (వివాహ జీవితంలో భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం), సీ- కాన్ఫిస్టెంట్ కరెక్ట్ యూజ్ ఆఫ్ కండోమ్ (సరైన విధంగా ఎల్లప్పుడూ కండోమ్ వాడడం). ఈ మూడు సూత్రాలపై పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.
సామాజిక చైతన్యంతో తగ్గుముఖం
ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యూనో డిఫీషియెన్సీ సిండ్రోమ్) తగ్గుముఖం పట్టడానికి సామాజిక చైతన్యమే ఆయువుపట్టయింది. జాతీయ స్థాయి మొదలుకొని, గ్రామీణ స్థాయి దాకా అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చేసిన కృషికి తోడు నిరక్షరాస్యుల్లో అవగాహన పెరగడంతో ఎయిడ్స్ తగ్గుముఖం పట్టడానికి కారణమైంది. విస్తృత చర్చతోపాటు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాధి ప్రబలకుండా తీసుకునే జాగ్రత్తలు పల్లె జనాన్ని సైతం మేల్కొల్పాయి.
ఈ ఆరేళ్లలో కేసులు ఇలా..
జిల్లాలో 5 (మంచిర్యాల, బెల్లంపల్లి. మందమర్రి, చెన్నూర్, లక్షెట్టిపేట) హెచ్ఐవీ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. 2017లో 28,867 మందికి హెచ్వీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 142 మందికి పాజిటివ్ వచ్చింది. 2018లో 37,631 మందికి పరీక్షలు నిర్వహించగా 166 మందికి పాజిటివ్, 2019లో 38,285 మందికి పరీక్షలు చేయగా 142 మందికి, 2020లో 24,705 మందికి పరీక్షలు చేయగా 108, 2021లో 32,789 మందికి టెస్టులు చేయగా 91, 2022 అక్టోబర్ వరకు 21,121 మందికి పరీక్షలు చేయగా 77 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక 2017 నుంచి 2022 అక్టోబర్ వరకు 88,380 మంది గర్భిణులకు హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 40 మందికి పాజిటివ్ వచ్చింది.
గోదావరిఖనిలో ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ సెంటర్
హెచ్ఐవీ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. గతంలో మెరుగైన చికిత్స కోసమని హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా రోగులకు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ సెంటర్ ల్యాబ్ అందుబాటులో ఉంది. రోగి ప్రాణాపాయం నుంచి తప్పించేలా (థర్డ్ లెవల్ డ్రగ్) అవసరమైన మందులను సకాలంలో అందిస్తున్నారు.