బెల్లంపల్లి, మార్చి 22 : తోటి విద్యార్థిని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న క్లాస్ రిప్రజెంటేటివ్(క్లాస్ లీడర్)ను లెక్చరర్లు మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన బెల్లంపల్లిలో కలకలం రేపింది. కుటుంబ స భ్యులు, విద్యార్థుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడేడ్ గ్రామపంచాయితీ పరిధిలోని కల్వపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు, కమలకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె భీముని వైష్ణవి(20) బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ (ఈఐ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నది.
ఈ నెల 14న కళాశాలలో ఓ విద్యార్థి పుట్టిన రోజు వేడుకల్లో వైష్ణవి (సీఆర్) తోటి విద్యార్థినులతో కలిసి పాల్గొన్నది. మరుసటి రోజు ఈఐ హెచ్వోడీ సాంబయ్య, లెక్చరర్లు మాలతి, నాగరాజు ఆమెను పిలిపించి గట్టిగా మందలించారు. అప్పటికే అనారోగ్యంతో ఉ న్న ఆమె అదేరోజు సాయంత్రం తనకు తల తిరుగుతుందని వార్డెన్కు చెప్పింది. ఈనెల 16న విద్యార్థినులతో కలిసి బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్య చికిత్సలు చేసిన ఆమెకు న్యూరో సమస్య ఉం దని, కార్పొరేట్ దవాఖానకు తరలించాలని సూచించారు. వెంటనే హెచ్వోడీ సాంబయ్య వారి తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు వచ్చి చేర్యాలకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో 17న సాయంత్రం వైష్ణవి ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చేర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. దవాఖానలో చికిత్స పొందుతూ ఈ నెల 21న సాయంత్రం మృతి చెందింది. ఆమె తండ్రి నర్సింహులు తన కూతురు హెచ్వోడీ సాంబయ్య, లెక్చరర్లు మాలతి, నాగరాజు వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని చేర్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చేర్యాల పోలీసులు ఈ ముగ్గురిని చేర్యాల పోలీస్స్టేషన్కు రావాలని ఫోన్ ద్వారా శుక్రవారం సమాచారం అందించారు.
లెక్చరర్ల వేధింపులతోనే వైష్ణవి ఆత్మహత్య కు పాల్పడిందని ఆరోపిస్తూ విద్యార్థులు శుక్రవారం తరగతులను బహిష్కరించి కళాశాల మెయిన్ గేట్ వద్ద ధర్నా చేశారు. సంబంధిత లెక్చరర్లును వెంటనే అరెస్టు చేయాలని డి మాండ్ చేశారు. అక్కడి నుంచి కొత్త బస్టాండ్ మెయిన్ రహదారిపై నిరసన వ్యక్తం చేయడానికి బయలు దేరారు. సమాచారం అందుకు న్న పోలీసులు కళాశాల ముందే వారిని అడ్డుకున్నారు. పోలీసులు, విద్యార్థులకు కొంత సేపు వాగ్వాదం జరిగింది. వెంటనే వన్టౌన్ ఎస్హెచ్వో దేవయ్య, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ వచ్చి వారిని సముదాయించడానికి యత్నించారు.
లెక్చరర్లను అరెస్టు చేసేంత వరకూ ఆందోళన విరమించబోమని పట్టుబట్టారు. ముగ్గురిపై చేర్యాల పోలీస్స్టేషన్లో కేసు నమోదైందని, ఆందోళన విరమించాలని ఎస్హెచ్వో దేవయ్య సూచించారు. ఇక్కడి పోలీసులు అరెస్టు చేయలేరని కూడా వివరణ ఇచ్చారు. అయినా విద్యార్థులు మూడు గంటల పాటు ఆందోళన చేయగా, ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని కళాశాల లెక్చరర్లు హామీ ఇవ్వడం, ఏసీపీ జోక్యం చేసుకొని ఆందోళన విరమించాలని కోరడంతో విద్యార్థులు మధ్యాహ్నం తరగతులకు వెళ్లారు.